పారిశుధ్యానికే ప్రాధాన్యం

ABN , First Publish Date - 2022-06-04T13:44:10+05:30 IST

రాష్ట్రంలోని కార్పొరేషన్లలో ఇకపై పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే దిశగా అవగాహన ప్రచార కార్యక్రమాలను ఉద్యమ స్థాయిలో నిర్వహించాలని

పారిశుధ్యానికే ప్రాధాన్యం

- నగరాల్లో పరిశుభ్రతపై అవగాహన ప్రచారం

- ప్రతి నెలా రెండో శనివారం కార్యక్రమం

- ప్రారంభించిన సీఎం స్టాలిన్‌


చెన్నై, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కార్పొరేషన్లలో ఇకపై పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే దిశగా అవగాహన ప్రచార కార్యక్రమాలను ఉద్యమ స్థాయిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం రాయపురం మింట్‌ స్ట్రీట్‌లో నగరపాలక శాఖ, నీటి సరఫరా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘నగరాల్లో పారిశుధ్యానికి ప్రజా ఉద్యమం’ పేరుతో అవగాహన ప్రచారయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్రలో ముఖ్యమంత్రి స్టాలిన్‌, మంత్రులు కేఎన్‌ నెహ్రూ, ఎం.సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు, మేయర్‌ ప్రియ, ఎంపీ కళానిధి వీరాసామి, ఎమ్మెల్యేలు ఆర్‌.మూర్తి, ఆర్డీ శేఖర్‌, జేజే ఎబినేజర్‌, డిప్యూటీ మేయర్‌ మహే్‌షకుమార్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్ సింగ్‌ బేదీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా పాదయాత్రకు సిద్ధమైనవారి చేత ముఖ్యమంత్రి స్టాలిన్‌ పారిశుద్ధ్య ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత పారిశుధ్యానికి సంబంధించిన ప్లకార్డులతో అందరూ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చెన్నై సహా 21 కార్పొరేషన్లు, 138 మున్సిపాలిటీలు, 490 నగర పంచాయతీల్లో ప్రతి నెలా రెండో శనివారాలలో పరిశుభ్రతపై అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారని చెప్పారు. ఈ  కార్యక్రమాల్లో ఆయా ప్రాంతాలకు చెందిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, సంఘసేవకులు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి  చేశారు. ప్రతి కార్పొరేషన్‌లోనూ రోజు చెత సేకరించేటప్పుడు తడిచెత్త, పొడిచెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలను వేర్వేరుగా విభజించి సేకరించాలని ఆయన సూచించారు. ఇక దుకాణాల వద్ద కూడా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ దిశగా దుకాణ దారుల సహకారంతో దుకాణాల ముందున్న చెత్తను తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలలో ఇకపై ప్లాస్టిక్‌ సంచులు ఉపయోగించకుండా ప్రభుత్వం ప్రకటించిన విధంగా పసుపు గుడ్డ సంచులను వాడేలా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

Updated Date - 2022-06-04T13:44:10+05:30 IST