గడప గడపకీ సంక్షేమ ఫలాలు

ABN , First Publish Date - 2022-06-02T13:31:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల ఫలాలు మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం అందేలా ఆయా శాఖల అధికారులు

గడప గడపకీ సంక్షేమ ఫలాలు

- అవినీతి, అశ్రితపక్షపతానికి తావివ్వవద్దు

- సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం ఆదేశం


చెన్నై, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాల ఫలాలు మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం అందేలా ఆయా శాఖల అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని, ఆ పథకాల అమలులో వేగం పెంచాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి తావులేని విధంగా ప్రజలు మెచ్చేలా మసలుకోవాలని హితవు పలికారు. పథకాల కోసం ప్రభుత్వం ఖర్చుపెడుతున్న నిధులన్నీ సద్వినియోగమయ్యేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. డీఎంకే ప్రభుత్వం యేడాదిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా 38 మంత్రిత్వ శాఖల పనితీరుపై ఆయన సమీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు బుధవారం ఉదయం సచివాలయం సమీపంలోని నామక్కల్‌ కవింజర్‌ భవనంలో 19 శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పథకాల అమలుపై ఆయా శాఖల అధికారుల పనితీరుపై సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు సహా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, ఆయా శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశ మందిరంలో డాష్‌బోర్డ్‌ ఏర్పాటు చేసి ఏడాది పాలనలో ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలు చేసిన పథకాలు, అమలు చేయాల్సిన  వాటి వివరాలను తిలకిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ శాఖాధికారుల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని శాఖల్లో ప్రభుత్వ పథకాల ఫలితాలు సక్రమంగా లబ్దిదారులకు చేరలేదనే ఆరోపణలు వస్తున్నాయని, ఆ శాఖల అధికారులు తమ పనితీరు మార్చుకుని సక్రమంగా పథకాలను అమలు చేయాలని ఆదేశించారు. ప్రతిశాఖలోనూ ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధుల వివరాలను, ఇకపై ఖర్చు చేయాల్సిన వాటి వివరాలను సంబంధిత అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో నగరపాలక, నీటి సరఫరా, ప్రజాపనులు, ఇంధనం, రహదారులు, చిన్న ఓడరేవులు, గృహనిర్మాణ, కార్మిక సంక్షేమం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ, తమిళ భాషాభివృద్ధి, పర్యాటకం, మానవ వనరుల అభివృద్ధి సహా 19 మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-02T13:31:37+05:30 IST