కొయ్యూరు ఎస్ఐకి సీఎం శౌర్య పతకం
ABN , First Publish Date - 2022-08-16T06:42:50+05:30 IST
కొయ్యూరు ఎస్ఐ దాసరి నాగేంద్రకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సీఎం శౌర్య పతకం లభించింది.
కొయ్యూరు, ఆగస్టు 15: కొయ్యూరు ఎస్ఐ దాసరి నాగేంద్రకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సీఎం శౌర్య పతకం లభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమంలో సోమవారం ఈ పతకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు అందజేశారు. యు.చీడిపాలెం పంచాయతీ తీగలమెట్ట సమీప అటవీ ప్రాంతంలో 2020 జూన్ 16న జరిగిన ఎన్కౌంటర్లో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆరుగురు మావోయిస్టులను హతమార్చిన ఘటనకు సంబంధించి ఈ పతకానికి నాగేంద్ర ఎంపికయ్యారు. ఈ పతకం అందుకున్న ఎస్ఐ నాగేంద్రను సీఐ స్వామినాయుడు, మంప ఎస్ఐ లోకేష్, పోలీసులు అభినందించారు.