సీఎం హోదాలో తొలిసారి.. కలెక్టరేట్ భవనం ప్రారంభం
ABN , First Publish Date - 2022-08-16T12:01:40+05:30 IST
సీఎం హోదాలో తొలిసారి.. కలెక్టరేట్ భవనం ప్రారంభం
వికారాబాద్, (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్ మంగళవారం వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో రూ.61 కోట్లతో నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయంతో పాటు వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ భవన్ను ప్రారంభించనున్నారు. జిల్లాకు మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వికారాబాద్ జిల్లాలో పర్యటించడం ఇదే తొలిసారి. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మంత్రి సబిత పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయల్దేరుతారు. వికారాబాద్లో మొదట టీఆర్ఎస్ భవన్ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఎన్నేపల్లి శివారులో నిర్మించిన కలెక్టరేట్(ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్) వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 5.15 గంటలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు.