వ్యవసాయం, రైతన్నను కాపాడుకోవడానికి దేవుడితోనైనా కొట్లాటకు సిద్ధం
ABN , First Publish Date - 2020-10-02T01:14:37+05:30 IST
తెలంగాణ వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునే విషయంలో దేవుడితోనైనా కొట్లాటకు సిద్దమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునే విషయంలో దేవుడితోనైనా కొట్లాటకు సిద్దమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని, స్వరాష్ట్రంలో వ్యవసాయ రంగంలో పండుగ వాతావరణం నెలకొన్నదని, పంటల దిగుబడిలో తెలంగాణ రైతు దేశానికే ఆదర్శంగా నిలిచాడని, తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యాగారంగా మారిందని పేర్కొన్నారు. సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ నదీజలాలను ఒడిసిపట్టుకుని తెలంగాణ బీళ్లను సస్యశ్యామలం చేస్తున్నామన్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణకు గోదావరి, కృష్ణా నదీ జలాల్లో హక్కుగా వచ్చే ప్రతి నీటి బొట్టును కూడా వినియోగించుకుని తీరుతామని అన్నారు. ఈ దిశగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టాల నడుమ నదీ జలాల అంశం పై ఈనెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు.
దీనికి సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాన్ని గురువారం ప్రగతి భవన్లో జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో జరిపిన ఉన్నతస్థాయి సమావేవంలో సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యేలు అబ్రహాం, సురేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, సీఎంఓ అధికారులునర్సింగరావు, భూపాల్రెడ్డి, నీటిపారుదలశాఖ సలహాదారు ఎస్కే జోషి, ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్, ఈఎన్సీలు మురళీధర్రావు, నాగేందర్రావు, హరిరాం, సీఈవోలు నర్సింహ, శంకర్, రమేశ్, ఓఎస్డీ ఽశ్రీధర్ దేశ్పాండే తదితరులు పాల్గొన్నారు.