జనగామ పర్యటనలో మంత్రి ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్ ప్రశంసలు
ABN , First Publish Date - 2022-02-11T23:12:15+05:30 IST
దేశంలోని టాప్ 10 అత్యుత్తమ గ్రామాలలో ఏడు తెలంగాణ గ్రామాలు అత్యుత్తమ గ్రామాలుగా ర్యాంకు సాధించడం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతర కృషి వల్ల సాధ్యం అయ్యిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రశంసించారు
జనగామ:దేశంలోని టాప్ 10 అత్యుత్తమ గ్రామాలలో ఏడు తెలంగాణ గ్రామాలు అత్యుత్తమ గ్రామాలుగా ర్యాంకు సాధించడం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతర కృషి వల్ల సాధ్యం అయ్యిందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రశంసించారు.తెలంగాణకు చెందినవే ఏడు గ్రామాలు అవార్డులు పొందడం హర్షణీయమైన విషయమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం నాడు 58 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో 25 ఎకరాల లో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయల సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.
గతంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పోతే పదింటిలో తొమ్మిది ఉమ్మడి జిల్లాలు బ్యాక్వర్డ్ కింద రాసి ఉన్నయ్.. ఈ రోజు రివర్స్ చేసి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పంచాయతీ రాజ్ అధికారులు, సిబ్బంది కృషి వల్ల, గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన ప్రగతి సూచికల ఫలితాలు తీస్తే.. దేశంలో పది గ్రామాలకు అవార్డులు వస్తే పదింటిలో ఏడు గ్రామాలు తెలంగాణయే ఉన్నాయి.
యావత్ దేశం మీద 28 రాష్ట్రాలు, మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాల లెక్కలు తీస్తే.. డెవలప్ అయిన పది గ్రామాల్లో ఏడు గ్రామాలు తెలంగాణలో ఉన్నాయి. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ను, అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. పంచాయతీరాజ్ సిస్టమ్లో భాగంగా పనిచేస్తున్న జడ్పీ ఛైర్మన్లు, మండలాధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, గ్రామ సర్పంచులు అందరికీ నేను సెల్యూట్ చేస్తున్నానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్రం తెచ్చిన వ్యక్తిగా నేను కోరుకునేది ఏం ఉంటది. నాకు ఇంతకన్న గొప్ప ఏం ఉంటది. ఎంత గర్వంగా.. తలెత్తుకొని చెప్పుకోగలుగుతాం అని ఆయన అన్నారు.