కొత్త చట్టాలతో నిరుపేదలకు బాధ కలగొద్దు: కేసీఆర్
ABN , First Publish Date - 2020-09-25T02:12:55+05:30 IST
కొత్త చట్టాల అమల్లో నిరుపేదలకు బాధ కలగకుండా చూడాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్లలోని ఎమ్మెల్యేలు
హైదరాబాద్: కొత్త చట్టాల అమల్లో నిరుపేదలకు బాధ కలగకుండా చూడాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్లలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. చట్టాల ఫలితాలు చివరి గుడిసె వరకు అందేలా చూడటమే లక్ష్యమని చెప్పారు. నూతన చట్టాల అమలు కోసం ప్రజా ప్రతినిధులు శ్రమించాలని సూచించారు. నూటికి నూరు శాతం ప్రజలే కేంద్ర బిందువని తెలిపారు. విప్లవాత్మక పాలనా సంస్కరణల్లో భాగంగానే వినూత్న చట్టాలు తీసుకొచ్చినట్లు వివరించారు. చట్టాలను కార్యాచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులదేనని పేర్కొన్నారు. భూ క్రమబద్దీకరణ పైసలతో ఖజానా నింపుకునే యోచన లేదని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ పూర్తిస్థాయిలో రూపుదిద్దుకునేలోగా అనేక చర్యలు చేపడతామన్నారు. భూములు, ఆస్తుల సమస్యలకు విధానపరమైన పరిష్కారాలు, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నవాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు చెందిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్లైన్లో నమోదు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.