సినీ సంగీత రంగం పై చెరగని ముద్రవేసిన లతామంగేష్కర్: కేసీఆర్

ABN , First Publish Date - 2022-02-06T22:39:21+05:30 IST

ప్రఖ్యాత నేపథ్య గాయని,భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు

సినీ సంగీత రంగం పై చెరగని ముద్రవేసిన లతామంగేష్కర్: కేసీఆర్

హైదరాబాద్: ప్రఖ్యాత నేపథ్య గాయని,భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్ధాల పాటు తన పాటతో భారతీయ సినీ సంగీత రంగం పై చెరగని ముద్ర వేశారని, ఆమె మరణం భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని అన్నారు. భారత దేశానికి లతా మంగేష్కర్ ద్వారా గాంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం అని సీఎం అన్నారు. లతాజీ మరణంతో పాట మూగ బోయినట్లయ్యిందని, సంగీత మహల్ ఆగిపోయిందని విచారం వ్యక్తం చేశారు.


 ‘‘ 20 భాషల్లో 1000 సినిమాల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన లతాజీ సరస్వతీ స్వరనిధి. ఆమె పాటల మహల్. వెండితెర మీద నడి హావభావాలకు అనుగుణంగా ఆ నటియే స్వయంగా పాడుతుందా అన్నట్టు తన గాత్రాన్ని అందించిన లతాజీ గొప్ప నేపధ్య గాయని, సినీ నిర్మాతలు మొదట హీరో హీరోయిన్లను ఖరారు చేసుకుని సినిమా నిర్మాణం ప్రారంభిస్తారు. కానీ సింగర్ గా లతాజీ సమయం ఇచ్చినంకనే సినిమా షూటింగ్ ప్రారంభించే వారంటే ఆమె గొప్పతనం అర్ధం చేసుకోవచ్చు. పాటంటే లతాజీ...లతాజీ అంటే పాట. సప్త స్వరాల తరంగ నాదాలలో శ్రోతలను తన్మయత్వంలో వోలలాడించిన లతా మంగేష్కర్, నార్త్, సౌత్ లకు సరిగమల వారధి. 


హిందూస్తానీ సంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీఖాన్ వద్ద నేర్చుకున్న లతాజీ.. ఉర్ధూ కవుల సాహిత్యాన్ని అధ్యయనం చేయడం వల్ల తన గాత్రంలో ఉర్ధూ భాషలోని గజల్ గమకాల సొబగులను లతాజీ గాత్రం వొలికించింది. కొందరికి పురస్కారాల వల్ల గౌరవం వస్తే, దేశ విదేశాల వ్యాప్తంగా ఆమెకు అందిన లెక్క లేనన్ని పురస్కరాలకు లతాజీ వల్ల గౌరవం దక్కింది. ఎందరో గాయకులు రావచ్చు. కానీ లతాజీ లేని లోటు పూరించలేనిది’’ అని సీఎం స్మరించుకున్నారు. లతామంగేష్కర్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Updated Date - 2022-02-06T22:39:21+05:30 IST