దళిత బంధు కేవలం కార్యక్రమం కాదు..ఉద్యమం: కేసీఆర్
ABN , First Publish Date - 2021-07-26T20:59:17+05:30 IST
దళిత బంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమం అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: దళిత బంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమం అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. దళితబంధు పథకంపై తొలి అవగాహన సదస్సు సోమవారం ప్రగతిభవన్లో జరుగుతోంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఈ సదస్సులో పాల్గొన్నవారంతా తెలంగాణ వ్యాప్తంగా దళితులకు అవగాహన కల్పించాలన్నారు. దళిత బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే దళితుల అభివృద్ధితోపాటు రాష్ట్రాభివృద్ధికి దారులువేస్తుందన్నారు. నైపుణ్యం, ప్రతిభ ఉన్న దళిత వర్గాన్ని అంతరానితనం పేరుతో ఊరవతల ఉంచి ఉత్పాదకరంగానికి దూరం చేయడం బాధాకరమన్నారు. మహిళలను జెండర్ పేరుతో అనుత్పాదక రంగానికి పరిమితం చేయడం తెలివితక్కువపని ముఖ్యమంత్రి అన్నారు.
హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు సాధించే విజయాలపై.. యావత్ తెలంగాణ దళితబంధు విజయం ఆధారపడి ఉందన్నారు. దళిత మహిళ మరియమ్మ లాకప్డెత్ కేసులో..దోషులుగా తేలిన పోలీసులను ప్రభుత్వం శాశ్వతంగా తొలగించిందన్నారు. దళిత బంధు పథకం పటిష్ఠ అమలుకు ప్రతినిధులు డేగ కన్నుతో పనిచేయాలని సూచించారు. ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే ఇతర రంగాలను గుర్తించాలన్నారు. వాటిలో దళితులకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్రావు, కొప్పుల ఈశ్వర్, దళిత ప్రజాప్రతినిధులు, హుజురాబాద్ నియోజకవర్గంలోని దళిత నేతలు పాల్గొన్నారు.