కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన ఎంపీ అరవింద్

ABN , First Publish Date - 2020-05-23T18:44:14+05:30 IST

కేసీఆర్ సర్కార్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్‌కు హుందాతనం లేదన్న విషయం ప్రపంచానికి తెలుసని

కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన ఎంపీ అరవింద్

హైదరాబాద్: కేసీఆర్ సర్కార్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్‌కు హుందాతనం లేదన్న విషయం ప్రపంచానికి తెలుసని ఎద్దేవా చేశారు. అందుకే తమ నాయకుల జోలికి వస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. జాతీయ సంపదైన ఖనిజ వనరులను కార్పొరేట్ పరిశ్రమలు దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మాట్లాడిన ఆయన.. మైహోమ్‌కి చెందిన సీఆర్‌హెచ్ మైనింగ్ సంస్థకి 50శాతం వాటా ఉందన్నారు. మైనింగ్ చట్టం ప్రకారం అన్ని రకాల బదిలీలు వేలం ద్వారా జరగాలని, కానీ అలా జరగలేదన్నారు. శ్రీజయ జ్యోతి సిమెంట్ 2013లో తమ యాజమాన్యాన్ని మైహోమ్‌కి మారిందని చెప్పిందన్నారు. మైహోమ్ వాళ్ళు తమకు జయ జ్యోతితో సంబంధం లేదని చెప్తున్నారన్నారు. తక్షణమే మౌహోమ్ మైనింగ్ కంపనీలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. 


2008 నుంచి 2019 వరకు విదేశీ పెట్టుబడుల నిబంధనలు ఉల్లంఘనలు జరిగాయన్నారు. మైనింగ్ సవరణ చట్టం ఉల్లంఘన, బెదిరింపులు, ట్రాన్స్ఫర్లు, జాతీయ సంపదను ఇతర దేశాలకు తరలించడం వంటి అక్రమాలకు మైహోమ్ పాల్పడిందన్న ఆయన... వేల కోట్ల జాతీయ సంపదను అడ్డంగా దోచుకుందన్నారు. మేళ్లచరువు(నల్గొండ) దగ్గర 300ఎకరాలు కేటాయింపులు జరిగిందన్నారు. ఇందులో 79 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ కాగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో 2011 ఫిబ్రవరిలో  113  ఎకరాలకు పైగా భూదాన్ భూమిలో 20ఏళ్ల నుంచి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గాయత్రి గ్రానైట్ రవి చంద్రకి 2017లో 10కోట్ల పెనాల్టీ వేయడంతో ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో ఆయనకు పెనాల్టీ మాఫీ చేశారు. తెలంగాణలో గులాబీ చట్టం నడుస్తుందని, ఈ అక్రమాలు మీద సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తనకు రామేశ్వర్ రావుతో వ్యక్తిగత కక్ష లేదని, ఆయన తన తండ్రి లాంటి వారన్నారు. అక్రమ మైనింగ్ వల్ల దేశానికి 4లక్షల కోట్ల రూపాయలు నష్టం జరుగుతుందన్నారు. 

Updated Date - 2020-05-23T18:44:14+05:30 IST