నకిలీ చలాన్లు ఎలా వచ్చాయి: సీఎం జగన్‌

ABN , First Publish Date - 2021-08-20T00:11:22+05:30 IST

రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయిని అధికారులను సీఎం

నకిలీ చలాన్లు ఎలా వచ్చాయి: సీఎం జగన్‌

తాడేపల్లి: రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయిని అధికారులను సీఎం జగన్‌ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఆదాయ వనరులు అందించే శాఖలపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆదాయ వనరుల పరిస్థితులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి ఏటా సహజంగా పెరిగే ఆదాయ వనరులు వచ్చేలా చూడాలన్నారు. జీఎస్టీ వసూళ్ల ద్వారా కూడా ఆదాయం వచ్చేలా చూసుకోవాలన్నారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపైన కూడా దృష్టిపెట్టాలన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన రెవిన్యూ వసూళ్లపైనా కూడా కలెక్టర్లు, జేసీలు దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. కొత్త వ్యూహాలు, కొత్త మార్గాల ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలన్నారు.  దీనికోసం వినూత్న సంస్కరణలను తీసుకురావాలని ఆదేశించారు. 


ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని అధికారులకు సీఎం సూచించారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని అధికారులను సీఎం ప్రశ్నించారు. ఏసీబీ దాడులు చేస్తే తప్ప ఈ వ్యవహారం వెలుగులోకి రాలేదన్నారు. వీరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను సీఎం ప్రశ్నించారు.  తప్పులకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్‌ చేశామని సీఎంకు అధికారులు తెలిపారు.


ఈ స్థాయిలో తప్పులు జరుగుతుంటే మన దృష్టికి ఎందుకు రావడంలేదని అధికారులను సీఎం నిలదీశారు. ఎప్పటినుంచి, ఎన్ని రోజుల నుంచి ఈ తప్పులు జరుగుతున్నాయన్నారు.  క్షేత్రస్థాయిలో వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయా, లేవా, ఎందుకు చూడ్డం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి నుంచి ఇంటెలిజెన్స్‌ సమాచారం తెప్పించుకోవాలని అధికారులకు సూచించారు. అవినీతిపై ఎవరికి కాల్‌ చేయాలో ప్రతి ఆఫీసులోనూ ఫోన్‌నంబర్‌ ఉంచాలని అధికారలును సీఎం ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ నంబర్‌ ఉండాలన్నారు. కాల్‌ సెంటర్‌కు వచ్చే కాల్స్‌మీద అధికారులు దృష్టిపెట్టాలని సూచించారు. కేవలం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే కాదు, అన్ని కార్యాలయాల్లో చలానాల చెల్లింపు ప్రక్రియను పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు.


సాఫ్ట్‌వేర్‌ మొత్తాన్ని నిశితంగా పరిశీలన చేశామని ఆర్థికశాఖ అధికారులు వివరించారు. అవినీతికి చోటు లేకుండా పూర్తిస్థాయిలో మార్పులు చేశామని అధికారులు తెలిపారు. మీ–సేవల్లోని పరిస్థితుల పైనా కూడా పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. కనీసం వారం, పదిరోజులకు ఒకసారి అధికారులు సమావేశం కావాలని సీఎం ఆదేశించారు. ఆదాయ వనరులు, పరిస్థితులపై సమీక్ష చేయాలని సీఎం ఆదేశించారు.


మద్యం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు. మద్యం అక్రమ రవాణా, కల్తీలపై ఉక్కుపాదం మోపాలన్నారు. మద్యం వినియోగాన్ని తగ్గించడానికి పలు చర్యలు తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. దీనివల్ల సరిహద్దుల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం వస్తున్న ఘటనలు చూస్తున్నామని సీఎం అన్నారు. 


Updated Date - 2021-08-20T00:11:22+05:30 IST