ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీలపై జగన్ నోరు మెదపలేదు: టీడీపీ ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2022-04-23T02:29:33+05:30 IST
ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీలపై జగన్ నోరు మెదపలేదు: టీడీపీ ఎమ్మెల్యే
ప్రకాశం: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ పర్యటన వల్ల ఒంగోలు ప్రజలకు ట్రాఫిక్ సమస్య తప్ప జిల్లాకు ప్రయోజనం లేదని బాలవీరాంజనేయ మండిపడ్డారు. పాదయాత్రలో జిల్లాకు ఇచ్చిన హామీలపై జగన్ నోరు మెదపలేదన్నారు. అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారని, కానీ 3 ఏళ్లలో వెలుగొండలో ఏం పనులు చేశారో చెప్పకుండా వెళ్లడం దురదృష్టకరమన్నారు. వెనుక బడిన జిల్లాలకు కేంద్రం నుంచే ఇచ్చే ప్యాకేజీపై ప్రధాని మోదీని ఎప్పుడైనా అడిగారా? అని సీఎంను ఎమ్మెల్యే ప్రశ్నించారు. రామాయపట్నం పోర్టు వల్ల నష్టపోయిన విభజన జిల్లాకు ఏం చేస్తారో అని ఎదురు చూసిన జిల్లా ప్రజల ఆశలు అడియాశలయ్యాయని ఆయన అన్నారు. టీడీపీ హయాంలో జిల్లాకు వచ్చిన ఏషియన్ పేపర్ మిల్ వంటి పరిశ్రమలను తరిమేసి ప్రజలకు ఉపాధి లేకుండా చేయటం తప్పా.. జగన్ రెడ్డి మూడేళ్లలో జిల్లాకు ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు. జిల్లాను అన్ని విధాలుగా మోసం చేసిన జగన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదని టీడీపీ ఎమ్మెల్యే జోస్యం చెప్పారు.