CM Jagan: రామాయపట్నం పోర్టు నిర్మాణం చారిత్రాత్మకమైనదన్న ఏపీ సీఎం
ABN , First Publish Date - 2022-07-20T18:48:44+05:30 IST
రాష్ట్రాలు అభివృద్ధి జరగాలంటే పోర్టులు ఉండటం ఓ వరమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
నెల్లూరు: రాష్ట్రాలు అభివృద్ధి జరగాలంటే పోర్టులు ఉండటం ఓ వరమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy) అన్నారు. బుధవారం రామాయపట్నం పోర్టు(Ramayapatnam port) నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. రూ.3,736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులకు శంకుస్థాపన చేసిన జగన్... డ్రెడ్జింగ్ పనులను ప్రారంభించారు. ఆపై రామాయపట్నం పోర్టు పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... రామాయపట్నం పోర్టు ద్వారా 4 బెర్తుల నిర్మాణం జరుగనున్నట్లు తెలిపారు. రూ.3,400 కోట్లతో పోర్టు నిర్మాణం జరుగుతుందని చెప్పారు. పోర్టు నిర్మాణానికి సహకరిస్తున్న గ్రామస్తులకు జగన్ ధన్యవాదాలు తెలియజేశారు. పోర్టు నిర్మాణం చారిత్రాత్మకమైనదని వెల్లడించారు. రానున్న దశాబ్దంలో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయన్నారు.
రాష్ట్రంలో ఉన్న 6 పోర్టుల కంటే మరో 4 పోర్టులను నిర్మించబోతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మన పిల్లలు ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు వస్తాయన్నారు. పోర్టుతో పారిశ్రామిక రంగం పురోగమిస్తుందని చెప్పుకొచ్చారు. ల్యాండ్ అక్రిడేషన్, బీపీఆర్ లేకుండానే 2019లో చంద్రబాబు(Chandrababu) శంకుస్థాపన చేశారని... ఇంత దారుణం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. కందుకూరు బైపాస్ రోడ్డు కోసం నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహకారం ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.