Jagan speech: మన స్వాతంత్ర్య పోరాటం మహోన్నతం
ABN , First Publish Date - 2022-08-15T15:43:29+05:30 IST
మన స్వాతంత్ర్య పోరాటం మహోన్నతం అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
విజయవాడ: మన స్వాతంత్ర్య పోరాటం మహోన్నతం అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) అన్నారు. స్వాతంత్ర దినోత్సవం (Independence day ) సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం జాతీయ పతాకాన్ని (National flag) ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ... పింగళి వెంకయ్య (Pingali venkaiah) రూపొందించిన జెండా భారతీయుల గుండె అని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి, భారతీయతకు, నిబద్ధతకు మన జెండా ప్రతీకని తెలిపారు. మనవతా విలువకు ఉదాహరణ మన స్వాతంత్ర్య పోరాటమని ఆయన చెప్పారు.
ఈ పోరాటంలో వాదనలు వేరైనా గమ్యం మాత్రం స్వాతంత్ర్యమే అని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అల్లూరి త్యాగాన్ని స్మరించుకోవాలన్నారు. 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని తెలిపారు. స్వాతంత్ర్యం నాటికి 18 శాతం సాగు భూమికి నీరందించారన్నారు. ఇప్పుడు 49 శాతం వ్యవసాయ భూమికి నీటి సదుపాయం ఉందని అన్నారు. ప్రపంచ ఫార్మా రంగంలో దేశం మూడో స్థానంలో ఉందన్నారు. దేశం దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి వేగంగా అడుగులు వేసిందన్నారు.
స్వాతంత్ర్యం తర్వాత దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని అన్నారు. ప్రపంచదేశాలతో భారత్ పోటీ పడుతోందన్నారు. ఆహారధాన్యాల లోటును అధిగమించి ముందడుగు వేశామని చెప్పారు. అర్హులైన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామని అన్నారు. వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ఆర్బీకేలు తీసుకొచ్చామన్నారు. ప్రతి మండలానికి రెండు పీహెచ్సీలు ఉండేలా చేసినట్లు చెప్పారు. పరిపాలనా వికేంద్రీకరణలో మరో అధ్యాయం జిల్లాల పెంపు అని తెలిపారు. రైతులకు అండగా వైఎస్సార్ రైతు భరోసా తీసుకొచ్చామన్నారు. 52 లక్షల మంది రైతులకు ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నామని జగన్ వెల్లడించారు.