సీఎం ఇంటి వద్దే ఉద్యమిస్తాం.. పవన్ హెచ్చరిక
ABN , First Publish Date - 2021-07-07T19:21:38+05:30 IST
సీఎం భద్రత పేరుతో ఇళ్లను ఖాళీ చేయిస్తారా అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఆడపడుచులను పచ్చి బూతులను తిడతారా
అమరావతి: సీఎం భద్రత పేరుతో ఇళ్లను ఖాళీ చేయిస్తారా అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఆడపడుచులను పచ్చి బూతులను తిడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నాయకులు ఉంటే.. మానభంగాలు ఎలా ఆగుతాయా అని ప్రశ్నించారు. జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం తనను కలిసిన తాడేపల్లి కరకట్ట వాసులకు పవన్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా తమ కష్టాలను, సమస్యలను పవన్కు తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి నివాసం చుట్టూ ఉన్నవారిని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని, ముందు స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారన్నారు. అర్ధరాత్రి ప్రొక్లెయినర్లను ఇళ్ల మీదకు పంపిస్తున్నారన్నారు. అదేమని అడిగితే చెప్పలేని విధంగా బూతులు తిట్టి బెదిరిస్తున్నారన్నారు. ముప్పై ఏళ్లుగా ఉంటున్న తమకు గూడు లేకుండా చేస్తున్నారన్నారు. తమకు అండగా నిలబడి ఉద్యమం చేయాలని పవన్ను బాధితులు విజ్ఞప్తి చేశారు. పవన్ మాట్లాడుతూ.. సీఎం ఇంటిచుట్టూ ఉన్నవారికే రక్షణ లేదని విమర్శించారు. 35 ఏళ్లుగా ఉన్నవారికి పునరావాసం కల్పించాలని, భయపెట్టి.. బెదిరిద్దాం అనుకుంటే ప్రజలు భయపడరని హెచ్చరించారు. ఖాళీ చేయించడం తప్పని సరైతే... వారికి ముందు న్యాయం చేయాలన్నారు. 350 కుటుంబాలకు ఇళ్లు ఇచ్చాకే అక్కడి నుంచి ఖాళీ చేయించాలన్నారు. మొండిగా ముందుకెళితే... జనసేన తరపున సీఎం నివాసం వద్దే ఉద్యమిస్తామని పవన్ హెచ్చరించారు.