కరోనా సేవల్లో లోటు రానీయొద్దు

ABN , First Publish Date - 2020-09-19T08:55:45+05:30 IST

కరోనా వైద్య సేవల్లో ఎక్కడా లోటు ఉండకూడదని.. కొవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రమాణాలు మరింత మెరుగవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించారు.

కరోనా సేవల్లో లోటు రానీయొద్దు

కొవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రమాణాలు పెరగాలి

అన్ని ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీకి అనుమతి

ఆరోగ్య ఆసరాలో ఆర్థిక సాయం పెంపు

6 నెలల్లో ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు మెరుగవ్వాలి

లేదంటే జాబితా నుంచి తొలగింపు

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం

అధికారులతో సమీక్షలో సీఎం జగన్‌


అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కరోనా వైద్య సేవల్లో ఎక్కడా లోటు ఉండకూడదని.. కొవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రమాణాలు మరింత మెరుగవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించారు. ఆయా ఆస్పత్రుల గ్రేడింగ్‌ కూడా పెరగాలని సూచించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కొవిడ్‌-19పై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అన్ని కొవిడ్‌ ఆస్పత్రుల్లో ప్లాస్మా థెరపీకి అనుమతి ఇస్తున్నట్టు చెప్పారు. ఆరోగ్య ఆసరాలో ఆర్థిక సహాయం పెంచాలని.. సాధారణ కాన్పుకు రూ.5000, సిజేరియన్‌కు రూ.3000 చెల్లించాలని ఆదేశించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారందరికీ కిట్లు అందాలన్నారు. సిబ్బంది నియామకాలు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని సీఎం పేర్కొన్నారు. అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్‌డె్‌స్కలు ఉండాలని, ఆరోగ్య మిత్రలు ఆరు రకాల బాధ్యతలు నిర్వహించాలని స్పష్టం చేశారు.


జిల్లా స్థాయిలో ఆరోగ్యశ్రీ పథకం సమన్వయ బాధ్యతలు జాయింట్‌ కలెక్టర్‌ తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు ఆరు నెలల సమయం ఇవ్వాలని.. ఈలోగా అవి ప్రమాణాలు మెరుగుపర్చుకోకపోతే వాటిని జాబితా నుంచి తొలగించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 11 టీచింగ్‌ ఆస్పత్రులు.. త్వరలో రానున్న 16 బోధనాస్పత్రులు, ఐటీడీఏ పరిధిలో ఏర్పాటవుతున్న ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, ఆహారం, ఆస్పత్రిలో శానిటేషన్‌ ప్రమాణాలు మెరుగ్గా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-19T08:55:45+05:30 IST