నేడు ఢిల్లీకి జగన్
ABN , First Publish Date - 2020-06-02T07:46:56+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ..
హోం మంత్రి అమిత్ షాతో భేటీ
కోర్టు నిర్ణయాలపై వైఖరి
వివరించే అవకాశం
నిర్మల, షెకావత్లతో కూడా..
రాష్ట్రానికి సాయం కోసం వినతి!
అమరావతి/న్యూఢిల్లీ జూన్ 1 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. మంగళవారం ఉదయం 10.30కి గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన బయల్దేరతారు. ఒంటిగంటకు ఢిల్లీ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా జన్పథ్-1లోని తన నివాసానికి వెళ్తారు. ఆ తర్వాత హోం మంత్రి అమిత్ షాతో పాటు ఆర్థిక, జలశక్తి మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్రసింగ్ షెకావత్, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులను కూడా ఆయన కలుస్తారని.. రాష్ట్రానికి సాయం అందించాల్సిందిగా అభ్యర్థిస్తారని, కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరతారని అధికార వర్గాలు తెలిపాయి.
మంగళవారం రాత్రి జగన్ ఢిల్లీలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం తిరిగి అమరావతికి బయలుదేరి వెళతారు. అయితే... ముఖ్యమంత్రిగా ఏడాది పాలనలో తీసుకునే అనేక నిర్ణయాలను హైకోర్టు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించి జగన్ తమ వైఖరిని అమిత్షాకు వివరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. శాసన మండలి రద్దుకు సహకరించాలని కేంద్రాన్ని కోరే అవకాశముంది.