షెడ్యూల్ కంటే ముందే ఢిల్లీకి సీఎం జగన్

ABN , First Publish Date - 2020-09-22T18:17:39+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ కంటే ముందే ఢిల్లీకి బయలుదేరారు.

షెడ్యూల్ కంటే ముందే ఢిల్లీకి సీఎం జగన్

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ కంటే ముందే ఢిల్లీకి బయలుదేరారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు కేంద్రమంత్రి అమిత్ షాతో జగన్ సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం నాలుగు గంటల లోపే సీఎం ఢిల్లీకి చేరుకుంటారని సమాచారం.  అమిత్ షా అపాయింట్‌మెంట్ ముందుగా ఖరారు కావడంతో అనుకున్న సమయం కంటే ముందే సీఎం జగన్ ఢిల్లీకి బయలుదేరారు.


జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలను కలుస్తారని సమాచారం. నిజానికి బుధవారం సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్‌ ఖరారు చేసుకున్న ఆయన.. ఆకస్మికంగా ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం గమనార్హం. రాష్ట్రంలో అనూహ్యంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ, షాలను కలవాలని ఆయన భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే వారి అపాయింట్‌మెంట్లను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కోరినట్లు సమాచారం.

Updated Date - 2020-09-22T18:17:39+05:30 IST