చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఓ దొంగల ముఠా: సీఎం జగన్‌

ABN , First Publish Date - 2022-04-07T19:34:30+05:30 IST

నరసరావుపేటలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు.

చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఓ దొంగల ముఠా: సీఎం జగన్‌

నరసరావుపేట: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. జిల్లా ఆవిర్భావం అనంతరం తొలిసారి సీఎం నరసరావుపేటకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ఓ దొంగల ముఠా అని, దొంగల ముఠా హైదరాబాద్‌లో ఉంటూ వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్లంతా మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలని, గతంలో ఏపీని దోచుకుని అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ తనకు క్లాస్‌ ఇచ్చారని ప్రచారం చేస్తున్నారని, తాను మోదీ మాత్రమే ఆ రూమ్‌లో ఉన్నామని, వీళ్లు రూమ్‌లో సోఫా కింద ఉండి విన్నారా? అని ప్రశ్నించారు. మారీచులు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని, ఎల్లో మీడియా ముసుగులో ఉన్నవారంతా దొంగల ముఠానే అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. 


డిపాజిట్లు కూడా దక్కని బాధ, ఏడుపు టీడీపీదని, ఏ పార్టీతో కావాలంటే ఆ పార్టీతో కలుస్తారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోతారని, చుట్టం వచ్చినట్లు రాష్ట్రానికి వచ్చివెళ్తారని సీఎం జగన్‌ విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందనుకుంటే విడివిడిగా పోటీ చేస్తారన్నారు. తమకు ఇష్టంలేని పార్టీ ప్రభుత్వంలో ఉంటే.. కలిసి పోటీచేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తారని మండిపడ్డారు. వారిది దొంగల ముఠా అని, అధికారం తప్ప వేరే ఎజెండా లేదని ముఖ్యమంత్రి జగన్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.


కాగా ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి, ఐజీ త్రివిక్రమవర్మ, ఎస్పీ వై రవి శంకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాలలో హెలిప్యాడ్‌ నుంచి సభా వేదిక ఏర్పాటు చేసిన సత్తెనపల్లి రోడ్డులోని స్టేడియం వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా సిమెంట్‌ రోడ్లకు గుంతలు వేసి మరీ బారికేడ్లు నిర్మించారు. జగన్‌ పర్యటన సందర్భంగా పట్టణంలోని ప్రైవేట్‌ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాల్సి వచ్చింది. ఇందుకు కారణం ఈ సంస్థల బస్సులను జగన్‌ సభకు జనాన్ని తరలించేందుకు రవాణా శాఖ కేటాయించింది. దీంతో ఆయా విద్యా సంస్థలకు సెలవు అనివార్యమైంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-04-07T19:34:30+05:30 IST