కర్తార్పూర్ సాహిబ్ యాత్రకు పంజాబ్ కేబినెట్ : సీఎం
ABN , First Publish Date - 2021-11-16T23:03:39+05:30 IST
పాకిస్థాన్లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాను నవంబరు
చండీగఢ్ : పాకిస్థాన్లోని కర్తార్పూర్ సాహిబ్ గురుద్వారాను నవంబరు 18న సందర్శించే తొలి బృందంలో పంజాబ్ కేబినెట్ మంత్రులు ఉంటారని ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్ని చెప్పారు. కర్తార్పూర్ కారిడార్ను బుధవారం నుంచి తెరవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను స్వాగతించారు.
గురుదాస్ పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ క్షేత్రం, పాకిస్థాన్లోని గురుద్వారా దర్బార్ సాహిబ్లను కలుపుతూ కర్తార్పూర్ కారిడార్ ఉంది. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ జీవితంలో చివరి ఘడియలను ఈ గురుద్వారా దర్బార్ సాహిబ్లోనే గడిపారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఈ కారిడార్ను మూసేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ఇచ్చిన ట్వీట్లలో ఈ కారిడార్ను బుధవారం నుంచి తెరవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ ప్రకటనను స్వాగతించినవారిలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బిర్ సింగ్ బాదల్ తదితరులు ఉన్నారు.