విధేయులతో సీఎం కెప్టెన్ సింగ్ భేటీ!

ABN , First Publish Date - 2021-09-18T19:27:52+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం నేపథ్యంలో

విధేయులతో సీఎం కెప్టెన్ సింగ్ భేటీ!

న్యూఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తనకు విధేయులైన ఎమ్మెల్యేలతో సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి హరీశ్ రావత్ శుక్రవారం రాత్రి ఇచ్చిన ట్వీట్‌లో, అత్యధిక ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు శాసన సభా పక్ష సమావేశాన్ని శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ సమావేశానికి ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించాలని కెప్టెన్ సింగ్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే కెప్టెన్ సింగ్ ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడారని, తనను అవమానిస్తున్నందువల్ల తాను పార్టీకి రాజీనామా చేస్తానని హెచ్చరించారని సమాచారం. 


హరీశ్ రావత్ శుక్రవారం రాత్రి ఇచ్చిన ట్వీట్‌లో, పంజాబ్ కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఎమ్మెల్యేల కోరిక మేరకు శనివారం (సెప్టెంబరు 18) సాయంత్రం 5 గంటలకు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో సీఎల్‌పీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏఐసీసీ ఆదేశిస్తోందని పేర్కొన్నారు. పంజాబ్‌లోని అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. ఈ ట్వీట్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధులకు ట్యాగ్ చేశారు. 


ఇదిలావుండగా, గత నెలలో నలుగురు మంత్రులు, దాదాపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కెప్టెన్ సింగ్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-09-18T19:27:52+05:30 IST