CM's visit: వరద ప్రాంతాల్లో సీఎం పర్యటన
ABN , First Publish Date - 2022-08-04T17:47:44+05:30 IST
రాష్ట్రంలో భారీ వర్షాలతో అట్టుడికిపోతున్న పలు ప్రాంతాలను ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) బుధవా
- ధైర్యంగా ఉండాలని భరోసా
బెంగళూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వర్షాలతో అట్టుడికిపోతున్న పలు ప్రాంతాలను ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) బుధవారం పర్యటించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందిన భట్కళ్ తాలూకాను పర్యటించిన ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు. త్వరలోనే పరిహారం అందచేస్తామని భరోసా ఇచ్చారు. ఇదే సందర్భంగా ఆయన వర్షం కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు నిత్యావసర పంపిణీని ప్రారంభించారు. మంత్రి అశోక్(Minister Ashok), ఇతర అధికారులు పాల్గొన్నారు.
దక్షిణకన్నడ జిల్లాలో మూడురోజులు రెడ్ అలర్ట్
తీరప్రాంతమైన దక్షిణకన్నడ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులపాటు రెడ్ అలర్ట్ అమలులో ఉంటుందని ఆ జిల్లా అధికారి బుధవారం ప్రకటించారు. పశ్చిమ కనుమల తీర ప్రాంతాలలో సోమవారం నుంచి భారీగా వర్షం కురుస్తోందని మరో నాలుగురోజులు ఇదే తరహాలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనశాఖ ప్రకటించింది. ఈ మేరకు జిల్లా అంతటా రెడ్ అలర్ట్(Red alert) ప్రకటించారు. సుళ్య, బెళ్తంగడి, కడబ తాలూకాలు మినహా మిగిలిన ప్రాంతాలలో సాధారణ వర్షం కురవవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.