ఆ విషయంలో Congress విఫలం

ABN , First Publish Date - 2022-02-17T18:21:13+05:30 IST

రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేసే విషయంలో కాంగ్రెస్‌ విఫలమైందని ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మై విరుచుకుపడ్డారు. సచివాలయంలో బుధవారం శాసనసభ సమావేశాలు వాయిదా పడిన అనంతరం

ఆ విషయంలో Congress విఫలం

                             - విరుచుకుపడ్డ Cm


బెంగళూరు: రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేసే విషయంలో కాంగ్రెస్‌ విఫలమైందని ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మై విరుచుకుపడ్డారు. సచివాలయంలో బుధవారం శాసనసభ సమావేశాలు వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ పతాకం అంశాన్ని సభలో లేవనెత్తడం ద్వారా నియమావళిని కాంగ్రెస్‌ ఉల్లంఘించిందన్నారు. జాతీయ పతాకం అంశం విషయంలో అనుసరించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయని, వీటిని కాంగ్రెస్‌ ఘోరంగా అవమానపరిచిందన్నారు. ప్రజలు జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నారన్నారు. మంత్రి ఈశ్వరప్ప, కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మధ్య శాసనసభలో బుధవారం జరిగిన ఘర్షణ ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి సంప్రదాయం కాదన్నారు. ఈశ్వరప్ప వ్యాఖ్యలపై శాసనసభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బదులిచ్చే సత్తా తమకు ఉం దన్నారు. తమకు వందేళ్ల చరిత్ర ఉందని చెప్పుకొనే కాంగ్రెస్‌ సభ్యులు శాసనసభలో అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదన్నారు. కాంగ్రెస్‌ తన చేష్టలతోనే ప్రజలకు మరింతగా దూరమవుతోందన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై జరిగే చర్చ సందర్భంగానే అనేక అంశాలను ప్రస్తావించేందుకు అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ సభా సమయాన్ని అనవసర విషయాలతో వృథా చేస్తోందన్నారు. మంత్రి ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలను గట్టిగా సమర్థించుకున్న ముఖ్యమంత్రి ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాషాయపతాకాన్ని 300-400 ఏళ్ల తర్వాత ఆవిష్కరించే అవకాశం ఉందని పేర్కొన్న ఆయన ఇదే సమయంలో జాతీయపతాకాన్ని అందరూ గౌరవించాలని కూడా పేర్కొన్న సంగతిని గుర్తు చేశారు. అయితే మంత్రి వ్యాఖ్యలలో ఎంపిక చేసిన కొన్ని భాగాలను మాత్రమే ప్రస్తావిస్తూ ప్రజలలో గందరగోళం రేకెత్తిస్తోందన్నారు. 

Updated Date - 2022-02-17T18:21:13+05:30 IST