రాజకాలువల విస్తరణపై జాప్యమెందుకు..?
ABN , First Publish Date - 2021-11-25T17:08:38+05:30 IST
వర్షం కురిసిందంటే బెంగళూరులో సమస్య తలెత్తుతోందని ఇంకెంతకాలం ఇబ్బందులు ఎదుర్కోవాలని, రాజకాలువల విస్తరణపై జాప్యమెందుకంటూ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు. రెండు రోజులుగా
- ఇంజనీర్లపై మండిపడ్డ CM బసవరాజ్ బొమ్మై
- పలు ప్రాంతాల్లో పర్యటన
బెంగళూరు: వర్షం కురిసిందంటే బెంగళూరులో సమస్య తలెత్తుతోందని ఇంకెంతకాలం ఇబ్బందులు ఎదుర్కోవాలని, రాజకాలువల విస్తరణపై జాప్యమెందుకంటూ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు. రెండు రోజులుగా నగరంలో వర్షాలధాటికి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కేఆర్పురంలోని సాయి లే అవుట్, కావేరినగర్, హెణ్ణూరు మెయిన్రోడ్డు మునిశామప్ప లే అవుట్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. వివిధ ప్రాంతాలను సందర్శించిన తర్వాత బీబీఎంపీ కార్యాలయంలో బుధవారం ఇంజనీర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఎక్కువ వర్షం కురిసిందంటే రాజకాలువలు పొంగిపొర్లుతున్నాయని, ఇళ్లలోకి నీరు చేరుతోందన్నారు. వెంటనే రాజకాలువల విస్తరణతోపాటు ఆక్రమణలను తొలగించాల్సిందేనని ఆదేశించారు. శిథిలావస్థకు చేరుకున్న కాలువలను పునఃనిర్మించాలని, పూడికలు తొలగించాలన్నారు. సీనియర్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయకపోతే ఎలాగంటూ మండిపడ్డారు. కాలువలలో సజావుగా నీరు వెళ్లకపోతే సమస్య తప్పదన్నారు. ఉన్నఫళంగా ఆక్రమణలు తొలగించకపోయినా అంచలంచెలుగా రాజకాలువలకు పూర్వవైభవం తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఇదే సందర్భంలో నగరవ్యాప్తంగా కొనసాగుతున్న పనులను అధికారులు వివరించారు. మంత్రులు అశ్వత్థనారాయణ, సోమణ్ణ, బైరతి బసవరాజ్లతోపాటు బీబీఎంపీ కమిషనర్ గౌరవ్గుప్త, అదనపు కార్యదర్శి రాకేశ్సింగ్తోపాటు బెంగళూరుకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.