సినిమా థియేటర్లపై మూడు రోజుల్లో నిర్ణయం: CM
ABN , First Publish Date - 2022-02-02T16:54:21+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో పూర్తిస్థాయి ప్రదర్శనకు అనుమతి ఇచ్చే విషయమై మరో మూడు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. నగరంలో తన నివాసంలో
బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో పూర్తిస్థాయి ప్రదర్శనకు అనుమతి ఇచ్చే విషయమై మరో మూడు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. నగరంలో తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలి బృందం సోమవారం రాత్రి తనను కలిసి ఈ మేరకు విజ్ఞప్తిచేసిందన్నారు. కొవిడ్ కేసులు క్రమేపీ తగ్గుముఖం పడుతుండటంతో నిపుణులతో సమాలోచనలు జరిపి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. కాగా సినిమా థియేటర్లలో 50 శాతం సీట్లతో ప్రదర్శన నిర్ణయాన్ని రద్దుచేయాలన్న తమ డిమాండ్కు సీఎం సానుకూలంగా స్పందించారని ఫిలిం చాంబర్ కార్యదర్శి ఎన్ఎం సురేష్ మీడియాకు చెప్పారు. థియేటర్లలో వందశాతం సీట్లతో ప్రదర్శనలకు అనుమతి మంజూరు చేస్తే ఈ వారం పలు కొత్త సినిమాలను విడుదల చేయాలని పలువురు నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు డీఆర్ జైరాజ్ మంగళవారం మీడియాకు చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన కొవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తామని, కావాలనుకుంటే ప్రభుత్వం తగిన పర్యవేక్షణ జరుపుకోవచ్చని ఆయన తెలిపారు.