Cm Bommai: వారి పీచమణుస్తాం...

ABN , First Publish Date - 2022-07-28T17:35:53+05:30 IST

సమాజంలో హింస, క్షోభ సృష్టించే కిరాతకుల పీచమణుస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Basavaraj Bommai) పేర్కొన్నారు.

Cm Bommai: వారి పీచమణుస్తాం...

బెంగళూరు, జూలై 27 (ఆంధ్రజ్యోతి): సమాజంలో హింస, క్షోభ సృష్టించే కిరాతకుల పీచమణుస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Basavaraj Bommai) పేర్కొన్నారు. బెంగళూరు ఆర్‌టీ నగర్‌లోని తన నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ యువనాయకుడు ప్రవీణ్‌(Praveen) దారుణహత్యపై తీవ్రంగా స్పందించారు. పోలీసు ఉన్నతాధికారులతో ఈ అంశంపై ఇప్పటికే చర్చించానన్నారు. హంతకులు కేరళవైపు నుంచి వచ్చినట్టు ప్రాథమికంగా తేలడంతో కాసరగోడు ఎస్పీతో రాష్ట్ర హోంశాఖ మంత్రి మాట్లాడారని తెలిపారు. రాష్ట్ర డీజీపీ ప్రవీణ్‌సూద్‌(Praveen Sood), కేరళ డీజీపీతో చర్చించారన్నారు. అతిత్వరలోనే నిందితులను పట్టివేసి కఠినశిక్ష పడేలా చూస్తామని ప్రజలకు ఆయన హామీనిచ్చారు. ఈ హత్యాకాండ వెనుక ఉన్న శక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రజలు ఆవేశానికి లోనుకాకుండా శాంతిని కాపాడాలని, ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని సీఎం విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఈ హత్యకేసును నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కి అప్పగించేందుకు వెనుకాడబోమని తెలిపారు. అంతకుముందు ఈ ఘటనకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సీఎంకు డీజీపీ ప్రవీణ్‌సూద్‌ అందించారు. 

Updated Date - 2022-07-28T17:35:53+05:30 IST