కస్తూరిరంగన్ నివేదికకు వ్యతిరేకంగా 25న ఢిల్లీకి అఖిల పక్షం
ABN , First Publish Date - 2022-07-20T18:40:56+05:30 IST
పశ్చిమ కనుమల ప్రాంతాన్ని బఫర్జోన్గా గుర్తిస్తూ కేంద్ర పర్యావరణశాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయడాన్ని మలెనాడు, కోస్తా ప్రాంత
- ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై
బెంగళూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ కనుమల ప్రాంతాన్ని బఫర్జోన్గా గుర్తిస్తూ కేంద్ర పర్యావరణశాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేయడాన్ని మలెనాడు, కోస్తా ప్రాంత ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 25న అఖిలపక్ష బృందంతో ఢిల్లీకి వెళ్లి పర్యావరణ శాఖ మంత్రికి వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మలెనాడు, కరావళి ఎమ్మెల్యేల ఆక్రోశం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలంతా కస్తూరి రంగన్ నివేదికను వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ నివేదిక శాస్త్రయ పద్ధతిలో సిద్ధం కాలేదని హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముసాయిదా నోటిఫికేషన్ను అంగీకరించే ప్రశ్నే లేదన్నారు. పశ్చిమ కనుమల ప్రాంతాన్ని పర్యావరణ సెన్సిటివ్ జోన్గా ప్రకటించడం వల్ల లక్షలాది మంది రైతులు వీధిపాలవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు పర్యావరణాన్ని సంరక్షించుకుంటూనే వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నారన్నారు. అవసరమైతే రాష్ట్ర బీజేపీ ఎంపీలంతా ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు, ఈ ముసాయిదాను అడ్డుకునేందుకు సన్నద్ధంగా ఉన్నట్టు ఆరగజ్ఞానేంద్ర తెలిపారు.