మోదీతో చేతులు కలుపుదాం...
ABN , First Publish Date - 2022-06-01T17:34:18+05:30 IST
దేశ నిర్మాణంలో అలుపెరగని కృషి చేస్తూ అంతర్జాతీయస్థాయిలో భారత కీర్తిని రెపరెపలాడిస్తున్న ప్రధాని నరేంద్రమోదీతో చేతులు కలుపుదామని ప్రజలకు ముఖ్యమంత్రి
- దేశనిర్మాణంలో ఆయన కృషి శ్లాఘనీయం
- Cm Basavaraj bommai పిలుపు
బెంగళూరు: దేశ నిర్మాణంలో అలుపెరగని కృషి చేస్తూ అంతర్జాతీయస్థాయిలో భారత కీర్తిని రెపరెపలాడిస్తున్న ప్రధాని నరేంద్రమోదీతో చేతులు కలుపుదామని ప్రజలకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పిలుపునిచ్చారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా కేంద్రప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ఏర్పాటైన చర్చాగోష్టిని సీఎం సచివాలయంలో మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన ప్రజలలో దేశభక్తిని పెంపొందించడంతోపాటు ఉజ్వల భవిష్యత్తుకోసం పరితపిస్తున్న ప్రధానికి అందరూ మద్దతు ఇవ్వాలన్నారు. 75ఏళ్లలో సాద్యం కాదని ఎన్నో జఠిలమైన సమస్యలను ప్రధాని నరేంద్రమోదీ కేవలం 8ఏళ్ల అవధిలోనే కొలిక్కి తెచ్చారని ఆయన కొనియాడారు. ప్రపంచం దృష్టంతా ఇప్పుడు భారత్పైనే ఉందన్నారు. ఎలాంటి అవినీతి మచ్చలేకుండా కొవిడ్ పరిస్థితిని నిభాయించడాన్ని ఆయన గుర్తు చేశారు. 2024 నాటికి ప్రజలందరికీ వసతి, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు వంటి లక్ష్యాలను సాకారం చేసేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రధాని కర్ణాటక రాష్ట్ర ప్రగతికి, ప్రజల సంక్షేమానికి చేసిన కృషిని ఆయన వివరించారు. ఈసందర్భంగా మంత్రులు, తదితరులు హాజరయ్యారు. ప్రధానితో జరిగిన చర్చాగోష్టిలో పాల్గొనే అవకాశం రాష్ట్రంలోని కలబురగికి చెందిన సంతోష్ కు దక్కింది. ‘గరీభీ కల్యాణ్ సమ్మేళన’ వీడియో సదస్సులో ఆమె కన్నడలోనే ప్రధానితో మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా తాను ఏవిధంగా ప్రయోజనం పొందిందీ వివరించారు. ఈ పథకం తమ జీవితంలో వెలుగు నింపిందని హర్షం వ్యక్తం చేసింది.