Chief Minister: ఆయన చెబితే రాజీనామా చేయాలా..?
ABN , First Publish Date - 2022-07-30T17:55:45+05:30 IST
రాష్ట్రంలో శాంతిభద్రతలు దారితప్పాయని, నైతిక బాధ్యత వహించి హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షనేత సిద్దరామయ్య
- ప్రతిపక్షనేతపై విరుచుకుపడిన సీఎం
బెంగళూరు, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాంతిభద్రతలు దారితప్పాయని, నైతిక బాధ్యత వహించి హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షనేత సిద్దరామయ్య వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి బసవరాజ్బొమ్మై(Chief Minister Basavarajbommai) విరుచుకుపడ్డారు. ఆర్టీ నగర్ నివాసం వద్ద శుక్రవారం సీఎం మీడియాతో మాట్లాడుతూ అతడు చెబితే వేదవాక్యమా అంటూ ఏకవచనంతోనే మండిపడ్డారు. అతడు చెప్పాడని రాజీనామాలు చేయాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ రాజీనామాలు చేసేది లేదని, చేయాల్సిన అవసరం కూడా లేదన్నారు. హత్యల తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకున్నామనేది ప్రజలకు తెలుసన్నారు. దీని వెనుక రాజకీయ ప్రోత్సాహం కూడా ఉందన్నారు. సిద్దరామయ్య(Siddaramaiah) పాలనలో 30దాకా వరుస హత్యలు చోటు చేసుకున్నాయని, అప్పుడు ఏ చర్యలు తీసుకోలేదని కానీ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. హత్యలు జరిగినప్పుడు సహజంగానే ఆందోళనలు జరుగుతాయని, అంతే వేగంగా పోలీసులు చర్యలు చేపట్టారన్నారు. కేరళ(Kerala) సరిహద్దు నుంచి వచ్చే వారిపై నిఘా పెంచామన్నారు. తీరప్రాంత జిల్లాలకు అనుబంధంగా ఉండే కేరళ సరిహద్దులపై ప్రత్యేక నిఘా విధిస్తామన్నారు. హోంశాఖమంత్రి రాజీనామాకు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారని అటువంటి అవసరం లేదన్నారు. మంగళూరు పరిధిలో పదిరోజుల వ్యవధిలో మూడు హత్యలు చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని ఏడీజీపీకు ఆదేశించామన్నారు. మూడు హ త్యల కేసుల విషయంలోను వ్యత్యాసం లేకుండా విచారణలు జరుపుతామన్నారు.