టీడీపీ గెలుపే ధ్యేయంగా పనిచేయండి
ABN , First Publish Date - 2022-07-01T06:18:41+05:30 IST
రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు.
టీడీపీ గెలుపే ధ్యేయంగా పనిచేయండి
క్లస్టర్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమ
అజిత్సింగ్నగర్, జూన్ 30 : రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. అజిత్సింగ్నగర్లోని టీడీపీ సెంట్రల్ కార్యాలయంలో గురువారం క్లస్టర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అఽధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారం కోసం వైసీపీ ప్రభుత్వం ఇప్పటి నుంచే ఎత్తుగడ వేసిందని, అందులో భాగంగానే టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించి, వైసీపీ మద్దతుదారులను చేర్చే కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. దీనిని డివిజన్ స్థాయి నుంచి బూత్ ఇన్చార్జ్లు పరిశీలించి ప్రతిఘటించాలని సూచించారు. అనంతరం సెంట్రల్ క్లస్టర్ కమిటీ పరిశీలకులుగా గొట్టుముక్కల రఘురామరాజు, ఘంటా కృష్ణమోహన్లను నియమించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, దేవతోట నాగరాజు, వల్లభనేని సతీష్, కంచి ధనశేఖర్, దాసరి కనకారావు, దివి ఉమ, శ్రీనివాస్, రామారావు, లబ్బా వైకుంఠం, బత్తుల కొండ, గార్లపాటి విజయ్ కుమార్, పాల్గొన్నారు.
ఆర్యూబీ ప్రాంతం పరిశీలన
అజిత్సింగ్నగర్ ఆర్యూబీ ప్రాంతాన్ని గురువారం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ఆర్యూబీ ముఖ ద్వారం వద్ద డ్రెయినేజీ కల్వర్టుపై ఐరన్ ప్లేట్లు విరిగిపోయి వాహనదారులు ఇబ్బందిపడటాన్ని గమనించారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ ఆర్యూబీలో డ్రెయినేజీపై మూతలు రిపేరు చేయలేని అసమర్ధ స్థితిలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నాడని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉండి తాను అధికారులతో మాట్లాడి డ్రెయినేజీ మరమ్మతులు చేయిస్తుంటే ఎమ్మెల్యే ఎక్కడ గుడ్లు పొదుగుతున్నాడని ప్రశ్నించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఘంటా కృష్ణ మోహన్, కంచి ధనశేఖర్, డాల్డా శ్రీను, గారపాటి విజయ్ కుమార్, లబ్బా వైకుంఠం తదితరులు పాల్గొన్నారు.
మధురానగర్ టీడీపీకి కొత్త కమిటీ నియామకం
మధురానగర్: సెంట్రల్లోని 29వ డివిజన్ మధురానగర్ టీడీపీకి నూతన కమిటీని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు నియమించారు. మొగల్రాజపురంలో బొండా ఉమా ఇంటి వద్ద గురువారం డి విజన్ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధురానగర్లో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. డివిజన్ అధ్యక్షుడిగా పుచ్చా పవన్, ప్రధాన కార్యదర్శిగా రామిల్లి సూర్యనారాయణను నియమించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, గౌతమీ ప్రసాద్, ఎస్పి శ్రీనివాస యాదవ్, మసిముక్కు శ్రీనివాస్, అంగిరేకుల రాంబాబు, సత్యనారాయణ, రామినాయుడు, రాబిల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.