Cloudburst: హిమాచల్ప్రదేశ్లో మెరుపు వరదలు..10మంది గల్లంతు
ABN , First Publish Date - 2021-07-28T13:37:53+05:30 IST
హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో మెరుపు వరదలు సంభవించడంతో 10మంది గల్లంతు కాగా, మరొకరు గాయపడ్డారు....
న్యూఢిల్లీ : హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో మెరుపు వరదలు సంభవించడంతో 10మంది గల్లంతు కాగా, మరొకరు గాయపడ్డారు.లాహౌల్ గిరిజన జిల్లాలో ఉదయపూర్ ప్రాంతంలో మెరుపు వరదలు సంభవించాయి. ఈ వరదల్లో రెండు గూడారాలు, ఓ జేసీబీ కొట్టుకుపోయాయి. ఈ దుర్ఘటనలో గూడారాల్లో ఉన్న 10 మంది కూలీలు గల్లంతు అయ్యారు. ఈ వరదల్లో 19ఏళ్ల మహ్మద్ అల్తాఫ్ అనే కూలీ తీవ్రంగా గాయపడ్డారు. గల్లంతు అయిన వారి కోసం హిమాచల్ ప్రదేశ్ పోలీసులు, ఐటీబీపీ బృందాలు గాలిస్తున్నాయి. వరదనీరు భారీగా ప్రవహిస్తుండటంతో గాలింపునకు ఆటంకం కలిగిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ డైరెక్టర్ సుదేష్ కుమార్ చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షపాతం కారణంగా భాగా నదిలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. లాహౌల్-స్పితి యొక్క డార్చా గ్రామానికి చెందిన ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించినట్లు హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ డైరెక్టర్ సుదేష్ కుమార్ చెప్పారు.కిన్నౌరులో కొండచరియలు విరిగిపడటంతో 60 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. బస్తరీ సమీపంలో యాత్రికులున్న టెంపోపై బండరాళ్లు పడటంతో 9 మంది పర్యాటకులు మరణించారు. సాంగ్లా-చిట్కుల్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడి వంతెన కూలిపోయింది.