స్కూళ్లు ఎలా తెరుస్తారు?..కేజ్రీని ప్రశ్నించిన బీజేపీ

ABN , First Publish Date - 2021-12-27T20:37:53+05:30 IST

ఒమైక్రాన్ వేరియంట్ భయాల మధ్య దేశ రాజధానిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంపై..

స్కూళ్లు ఎలా తెరుస్తారు?..కేజ్రీని ప్రశ్నించిన బీజేపీ

న్యూఢిల్లీ: ఒమైక్రాన్ వేరియంట్ భయాల మధ్య దేశ రాజధానిలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంపై బీజేపీ స్పందించింది. వైరస్ వ్యాప్తి నిరోధానికి ఢిల్లీ ప్రభుత్వం రోడ్‌ మ్యాప్ సిద్ధం చేయాలని, అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని డిమాండ్ చేసింది. ఎయిర్ క్వాలిటీ క్షీణతతో ఈ నెల ప్రారంభంలో 5వ తరగతి వరకూ మూతపడిన స్కూళ్లు సోమవారం నుంచి తిరిగి తెరుచుకున్నాయి. 6వ తరగతి పైబడిన విద్యాసంస్థలు ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యాయి. దీనిపై  ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా సోమవారంనాడు ఓ ట్వీట్‌లో స్పందస్తూ, ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నందున పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని విద్యా సంస్థలన్నింటినీ మూసివేయాలని అన్నారు. కోవిడ్ నుంచి ఢిల్లీ ప్రజలను కాపాడేందుకు కోవిడ్ నిరోధక చర్యలపై రోడ్ మ్యాప్‌ను ప్రభుత్వం సిద్ధం చేయాలని, అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


కాగా, పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. సోమవారం రాత్రి నుంచే ఈ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. మరోవైపు, ఢిల్లీలో ఇంతవరకూ 79 ఒమైక్రాన్ కేసులు వెలుగుచూడగా, 23 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

Updated Date - 2021-12-27T20:37:53+05:30 IST