అన్రాక్కు రైల్వే ట్రాక్ నిర్మాణానికి లైన్ క్లియర్!
ABN , First Publish Date - 2021-12-02T06:29:26+05:30 IST
అన్రాక్ అల్యూమినియం రిఫైనరీ కంపెనీకి సంబంధించి రైల్వేట్రాక్ నిర్మాణానికి ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సదరు జీవో 274 కాపీ జిల్లా కలెక్టర్ నుంచి డివిజనల్ రెవెన్యూ అధికారికి అందింది. కర్మాగారానికి అవసరమైన ముడి సరకును ఒడిశా నుంచి తీసుకువచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఏలేరు కాలువ గట్టు మీదుగా 30.25 కి.మీ. పొడవున ట్రాక్
జీవో 274 విడుదల
ఏడాదికి రూ.35 లక్షలు చొప్పున సదరు స్థలం లీజు
మాకవరపాలెం, డిసెంబరు 1 : అన్రాక్ అల్యూమినియం రిఫైనరీ కంపెనీకి సంబంధించి రైల్వేట్రాక్ నిర్మాణానికి ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సదరు జీవో 274 కాపీ జిల్లా కలెక్టర్ నుంచి డివిజనల్ రెవెన్యూ అధికారికి అందింది. కర్మాగారానికి అవసరమైన ముడి సరకును ఒడిశా నుంచి తీసుకువచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అయితే రోడ్డు మార్గం కాకుండా రైల్వే వ్యాగన్ల ద్వారా బాక్సైట్ తేవాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా కశింకోట మండలం బయ్యవరం నుంచి మాకవరపాలెం మండలం రామన్న పాలెం వద్ద గల అన్రాక్ కంపెనీ వరకూ 30.25 కి.మీ. పొడవున రైల్వే మార్గం నిర్మిం చాలని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఇందులో భాగంగానే ఇటీవల సెప్టెంబరు ఒకటో తేదీన నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు రైల్వే నిర్మాణం ఏర్పాటు చేయనున్న ఏలేరు కాలువ గట్టు పరిసరాలను పరిశీలించారు. ఇదిలావుంటే, పరిశ్రమకు అవసరమైన బాక్సైట్ను విశాఖ ఏజెన్సీలో తవ్వి తీసేందుకు సాధ్యం కానందున, ఒడిశా నుంచి తీసుకువచ్చేలా అక్కడ ప్రభుత్వంతో చర్చించారు. ఇప్పటికే ఇందుకు సంబం ధించిన సరకు విశాఖ పోర్టుకి చేరుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రోడ్డు మార్గం కంటే రైల్వే మార్గం ద్వారా గిట్టుబాటు అవు తుందని భావిస్తున్న నేపథ్యంలో బయ్యవరం నుంచి కంపెనీ వరకు ట్రాక్ ఏర్పా టుకు ప్రతిపాందించారు. ట్రాక్ నిర్మాణం కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. బయ్యవరం నుంచి ఏలేరు కాలువ గట్టు మీదగా అన్రాక్ కంపెనీకి 30.25 కి.మీ. పొడవున ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నట్టు జీవోలో పొందపరిచారు. అలాగే, సదరు ట్రాక్ నిర్మాణం చేపట్టే స్థలానికి ఏడాదికి సుమారు రూ.35లక్షల లీజు చెల్లించాలని జీవో కాపీలో పొందపరిచారని సమాచారం. ఇప్పటికే కొత్తగా 250 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోని శిక్షణ కూడా ఇస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ అన్రాక్ కంపెనీ ప్రారంభానికి అన్ని అడ్డంగులు తొలగిపోయినట్టేనని తెలుస్తోంది. మరో కొద్ది రోజుల్లో రైల్వే ట్రాక్ పనులు ప్రారంభించే అవకాశం ఉంది. దీని పై ఇప్పటికే స్ధానిక రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు.