పరిసరాల పరిశుభ్రతకే ప్రాధాన్యం
ABN , First Publish Date - 2020-06-01T09:21:04+05:30 IST
వర్షాలు ప్రారంభమవుతున్న తరుణంలో ప్రతిఒక్కరూ తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
షాద్నగర్: వర్షాలు ప్రారంభమవుతున్న తరుణంలో ప్రతిఒక్కరూ తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల్లో భాగంగా ఆయన మండలంలోని తన స్వగ్రామమైన ఎక్లా్సఖాన్పేట ఇంటి ఆవరణలో మొక్కలకు నీరు పోశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతా్పరెడ్డి శంషాబాద్లోని తన ఇంట్లో మొక్కల కుండీల్లో నిలిచిన నీటిని తొలగించారు. వారితో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బాబయ్య, పట్టణానికి చెందిన పలువురు కౌన్సిలర్లు తమ ఇళ్ల పరసరాలను శుభ్రం చేశారు.
అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్సీ
ఆమనగల్లు: వర్షాకాలం ప్రారంభం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా తన నివాసంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పూలకుండీలను శుభ్రం చేశారు. ఇంటి ఆవరణలో వర్షం నీరు నిల్వ లేకుండా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ ఇంటి పరిసరాలను స్వయంగా శుభ్రం చేసుకోవాలన్నారు. డెంగీ, చికెన్గున్యా, మలేరియా వ్యాధులకు కారణమవుతోన్న దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.
మురుగునీటిని తొలగించండి : చైర్పర్సన్
మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం 10గంటలకు 10నిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఆమె కాపుగడ్డలో మురుగునీటి వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు స్థానికులందరూ తమ ప్రాంతాల్లో నిలువ ఉన్న మురుగునీటిని తొలగించాలని కోరారు.
స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదాం
ఆమనగల్లు పట్టణాన్ని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిద్దేందుకు సహకరించాలని కమిషనర్ శ్యాంసుందర్ కోరారు. మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు 10 నిమిషాలు పట్టణంలో కౌన్సిలర్లు, ప్రజలతో కలిసి పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. రోడ్లపైన చెత్త వేస్తే జరిమానా విధించనున్నట్లు హెచ్చరించారు.