బడిలో మరుగుదొడ్లు శుభ్రం చేయండి

ABN , First Publish Date - 2021-11-19T15:40:53+05:30 IST

మరుగుదొడ్ల ఫొటోలు తీసి..

బడిలో మరుగుదొడ్లు శుభ్రం చేయండి

టీచర్లు, తల్లిదండ్రులు శ్రమదానం చేయాలి 

పాఠశాల విద్యాశాఖ అధికారుల ఉత్తర్వులు 


అమరావతి(ఆంధ్రజ్యోతి): మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేసే పని నుంచి టీచర్లకు ఇటీవలే మినహాయింపు ఇచ్చారు. అయితే ఈ నెల 19న ‘ప్రపంచ టాయ్‌లెట్‌ డే’ సందర్భంగా పాఠశాలల్లో మరుగుదొడ్లను ఉపాధ్యాయులు, పేరెంట్స్‌ కమిటీలు శుభ్రం చేయాలంటూ సర్కారు గురువారం చిత్రమైన ఉత్తర్వు జారీ చేసింది. మరుగుదొడ్లను సందర్శించి, శుభ్రంచేసే కార్యక్రమంలో వీరితో పాటు విద్యాశాఖ అధికారులు కూడా పాల్గొనాలని ఆదేశించింది. అందుకోసం ఉపయోగించే కెమికల్స్‌, ఇతర పరికరాల గురించి పిల్లలకు చెప్పాలని సూచించింది. శ్రమదానం చేసి మరుగుదొడ్లను శుభ్రం చేయాలని పేర్కొంది. అలాగే పాఠశాలల్లో సేవలందిస్తున్న ఆయాలను అభినందించి, వారిని విద్యార్థులకు పరిచయం చేయాలని ఆదేశించింది.


అయితే ఈ ఉత్తర్వుపై వ్యతిరేకత రావడంతో ‘వరల్డ్‌ టాయ్‌లెట్‌ డే’ను శుక్రవారం కాకుండా మరో రోజు నిర్వహించాలంటూ విద్యాశాఖ అధికారులు మళ్లీ ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు జోక్యం చేసుకొని వివరణ ఉత్తర్వులు జారీచేశారు. ‘‘ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మరుగుదొడ్ల ఆవశ్యకత గురించి తల్లిదండ్రులు, విద్యార్థుల్లో అవగాహన కల్పించడమే. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సలహాదారు, డైరెక్టర్‌ కూడా పాల్గొంటున్నాం. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛందం, ఐచ్ఛికం...’’ అని పేర్కొన్నారు. మరోవైపు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆప్షనల్‌ హాలిడే తీసుకున్న పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని మరో రోజు నిర్వహించాలని సూచించారు.

Updated Date - 2021-11-19T15:40:53+05:30 IST