‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’ పటిష్టంగా చేపట్టాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-03-02T05:43:22+05:30 IST

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో చేపడుతున్న 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు.

‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’ పటిష్టంగా చేపట్టాలి : కలెక్టర్‌
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు(హరనాథపురం), మార్చి 1 : క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో చేపడుతున్న 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదేశించారు. సోమవారం తిక్కన భవన్‌లో రాష్ట్ర పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి వీ రామ మనోహర్‌రావు, నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌ దినేష్‌ కుమార్‌తో కలిసి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో కలెక్టర్‌ సమీక్షించారు.  రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలను పరిశుభ్రంగా ఉంచేలా 100 రోజుల కార్యచరణ ప్రణాళిక ను రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్‌ అధికారులు ప్రతిరోజూ పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. రామ మనోహర్‌రావు మాట్లాడుతూ ‘క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌’పై కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

 

8 శాతం రేషన్‌ పంపిణీ 

నెల్లూరు(హరనాథపురం) : జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సోమవారం రేషన్‌ పంపిణీ ప్రారంభం అయింది. తొలిరోజు 8 శాతం సరుకుల పంపిణీ జరిగినట్లు డీఎస్వో బాలకృష్ణారావు తెలిపారు.

 

86.78 శాతం పింఛన్ల పంపిణీ  

 వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభం అయింది. ఉదయం 6 గంటలకే వలంటీర్లు పింఛనుదారుల ఇంటింకి వెళ్లి నగదు అందచేశారు.  జిల్లాలో 3,68,104 మందికి పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండగా తొలిరోజు 3,10,374 మందికి (86.78 శాతం) పంపిణీ చేశారు.  

Updated Date - 2021-03-02T05:43:22+05:30 IST