బీజేపీ, టీఆర్‌ఎస్‌ వర్గీయుల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2021-11-12T00:47:18+05:30 IST

టీఅర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలంటూ

బీజేపీ, టీఆర్‌ఎస్‌ వర్గీయుల మధ్య ఘర్షణ

సిరిసిల్ల: టీఅర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలంటూ బీజేపీ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ సముదాయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. ధర్నా కొనసాగుతున్న క్రమంలో టీఆర్‌ఎస్‌ యువజన విభాగానికి చెందిన నాయకులు వారి ధర్నాను భగ్నం చేయడానికి పూనుకున్నారు. బీజేపీ నాయకులపై దాడికి పూనుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌, సీఐలు, ఎస్‌ఐలు, టీఆర్‌ఎస్‌ యువజన నాయకులను  ఆరెస్ట్‌ చేశారు. వారిని కలెక్టరేట్‌లోకి వ్యాన్‌లో లోపలికి తీసుకెళ్లారు. ఇదే క్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకుల దాడిని నిరసిస్తూ బీజేపీ నాయకులు కరీంనగర్‌, సిరిసిల్ల రహదారిపై రాస్తారోకో చేశారు. దాదాపు గంట పాటు సాగిన ఆందోళనతో ట్రాఫిక్‌ స్తంభించి పోయింది. పోలీసులు బీజేపీ నాయకులను బలవంతంగా లాక్కెళ్లి వ్యాన్‌లో పడేశారు. వారిని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు తరలించారు. ఇదే క్రమంలో బీజేపీ నాయకులు కొందరు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుని వెళ్లారు. అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ యువజన నాయకులు మరోసారి దాడికి దిగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాలను ఆరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దాదాపు మూడు గంటల పాటు కలెక్టరేట్‌లోకి ఎవరిని వెళ్లనివ్వకుండా రాకపోకలు నిలిపివేశారు.

Updated Date - 2021-11-12T00:47:18+05:30 IST