MP Kesineni Nani పార్టీ మార్పుపై క్లారిటీ.. అసలు సంగతి ఇదీ..

ABN , First Publish Date - 2021-10-18T17:07:22+05:30 IST

టీడీపీ కీలక నేత, ఎంపీ కేశినేని నాని పార్టీ మారుతున్నారని ఇవాళ ఉదయం నుంచి...

MP Kesineni Nani పార్టీ మార్పుపై క్లారిటీ.. అసలు సంగతి ఇదీ..

అమరావతి : టీడీపీ కీలక నేత, ఎంపీ కేశినేని నాని పార్టీ మారుతున్నారని ఇవాళ ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కేశినేని భవన్‌ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటోలను తొలగించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరాయి. మరోవైపు.. ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో కూడా కేశినేని కీలక చర్చలు జరుపుతున్నారని కూడా పుకార్లు షికార్లు చేశాయి. ఈ క్రమంలో విజయవాడ టీడీపీ నేత ఫతావుల్లా మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం వ్యవహారంపై క్లారిటీ ఇచ్చేశారు.


అసలు సంగతి ఇదీ...

కేసినేని భవన్‌లో చంద్రబాబు ఫ్లెక్స్‌లు తొలగించలేదని.. ఒక చోట రతన్ టాటాతో నాని ఉన్న ఫోటో మాత్రమే అదనం ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. కేశినేని భవన్ చుట్టూ, లోపల చంద్రబాబు, ఇతర నేతల ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయని స్పష్టం చేశారు. టాటా ట్రస్ట్ సేవల గుర్తింపుగానే లోపల ఒక ఫోటో ఏర్పాటు చేశామన్నారు. రతన్ టాటా ట్రస్ట్‌తో కలిసి చేసే సేవలు మరింత విస్తరిస్తున్నామని అందుకే ఇలా ఫొటోలను ఏర్పాటు చేశామని ఫతావుల్లా వెల్లడించారు.


పార్టీ మార్పుపై..

పార్టీలు మారతారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అదంతా అవాస్తవమని ఫతావుల్లా మీడియాకు తెలిపారు. అసలు మునిగిపోయే పడవలోకి ఎవరైనా వెళ్తారా..? అని ఆయన ఒకింత సెటైర్లు వేశారు. పార్లమెంట్ కమిటీ మీటింగ్‌ల కోసం కేశినేని నాని ఢిల్లీ వెళ్లడం మామూలేనని.. అలా ఆయన రాజధానికి వెళ్లిన ప్రతిసారీ ఇలా పార్టీ మారుతున్నారని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫతావుల్లా చెప్పుకొచ్చారు. కాగా.. ఆయన టీడీపీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ఇవాళ ఉదయం మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం విదితమే. కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన నెలకొనడంతో టీడీపీ నేత ఫతావుల్లా మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా క్లారిటీ ఇచ్చుకున్నారు. అయితే పార్టీ నేతలు ఇలా స్పందిస్తున్నారే తప్ప ఇంతవరకూ కేశినేని మాత్రం ఎక్కడా ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చిన దాఖలాల్లేవ్.

Updated Date - 2021-10-18T17:07:22+05:30 IST