కుడుమూరు భూములపై స్పష్టత
ABN , First Publish Date - 2022-01-20T04:53:45+05:30 IST
పాచిపెంట మండలం కుడుమూరు గ్రామానికి చెందిన సుమారు 750 ఎకరాలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. అవి ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ బుధవారం అధికారులు ప్రకటన విడుదల చేశారు. దీంతో రెండేళ్లుగా సాగుతున్న వివాదానికి తెరపడింది. కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న బడాబాబులకు చెక్ పడినట్లయింది.
ప్రభుత్వానివేనని అధికారుల ప్రకటన
రెండేళ్లుగా నలుగుతున్న వివాదం
పార్వతీపురం, జనవరి 19: పాచిపెంట మండలం కుడుమూరు గ్రామానికి చెందిన సుమారు 750 ఎకరాలపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. అవి ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ బుధవారం అధికారులు ప్రకటన విడుదల చేశారు. దీంతో రెండేళ్లుగా సాగుతున్న వివాదానికి తెరపడింది. కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న బడాబాబులకు చెక్ పడినట్లయింది.
కుడుమూరులోని 750 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు బడాబాబులు కొంతకాలంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు అధికారులు, నేతలను ప్రసన్నం చేసుకుంటూ చేజెక్కించుకునే పనిలో ఉన్నారు. ఈ భూములు ఇనాం భూములని.. తమకే చెందుతాయని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సాధారణ ఎన్నికలకు ముందు విశాఖపట్నం జిల్లా నుంచి ఎన్నికల విధుల కోసం తహసీల్దార్గా వచ్చిన ఓ అధికారి ఈ భూములపై కొన్ని పత్రాలను బడాబాబులకు ఇచ్చారు. అప్పటి నుంచి వివాదం మొదలైంది. ఆ భూములను దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నామని, తమకే దక్కాలని గిరిజనులు రెండేళ్లుగా పోరాడుతున్నారు. వారి ఆందోళనలతో అధికారుల్లో కదలిక వచ్చింది. పూర్వ రికార్డులను కలెక్టరేట్ కార్యాలయంలో పూర్తిగా పరిశీలించాక ఆ భూములు ప్రభుత్వ భూములుగా నిర్ధారించారు. ఆ 750 ఎకరాలు ప్రభుత్వ భూములుగా స్పష్టంచేస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూములని ఐటీడీఏ పీవో కూర్మనాథ్ కూడా స్పష్టం చేశారు. ఈ పరిణామంతో భవిష్యత్తులో ఈ భూములు ప్రభుత్వ అవసరాలకు వినియో గించవచ్చు లేదా ప్రస్తుతం సాగు చేస్తున్న గిరిజనులకు శాశ్వత హక్కు కల్పించే అవకాశం ఉంది. తాజా నిర్ణయంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆ భూములు ప్రభుత్వానివే
పాచిపెంట మండలం కుడుమూరు భూములు ప్రభుత్వ భూములుగా గుర్తించాం. ఆ భూములను 250 మంది గిరిజనులు సాగుచేస్తున్నారు. గిరిజనులకు అండగా ఐటీడీఏ ఉంటుంది. కలెక్టరేట్లో లభ్యమైన రికార్డుల ప్రకారం కుడుమూరు భూములు ప్రభుత్వ భూములుగా నిర్ధారణ అయింది.
- ఆర్.కూర్మనాథ్, పీవో, ఐటీడీఏ