Ayodhya: జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ సంచలన హెచ్చరిక
ABN , First Publish Date - 2021-09-29T15:09:09+05:30 IST
జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ కేంద్ర ప్రభుత్వానికి సంచలన హెచ్చరిక జారీ చేశారు....
భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించండి, లేకుంటే నేను జల సమాధి చేసుకుంటాను...
న్యూఢిల్లీ:జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ కేంద్ర ప్రభుత్వానికి సంచలన హెచ్చరిక జారీ చేశారు.మహాత్మాగాంధీ జన్మదినం అయిన అక్టోబర్ 2వతేదీ నాటికి భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని చవానీకి చెందిన ప్రముఖ తపస్వీ జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ డిమాండ్ చేశారు.తమ డిమాండ్లను నెరవేర్చకపోతే తాను జల సమాధి చేసుకుంటానని మహారాజ్ బెదిరించారు.‘‘అక్టోబర్ 2వతేదీ లోపు భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను, లేదంటే నేను సరయు నదిలో జల సమాధి చేసుకుంటాను’’ అని అయోధ్యలో జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ చెప్పారు.
భారతదేశంలోని ముస్లిములు, క్రైస్తవుల జాతీయతను రద్దుచేయాలని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని జగద్గురు పరమహంస డిమాండ్ చేశారు.పరమహంస ఆచార్య గతంలో 15 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు.అప్పట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి హామీ లభించిన తర్వాత ఆయన నిరాహార దీక్ష విరమించారు.జగద్దురు పరమహంస చేసిన డిమాండ్లకు మద్దతుగా హిందూ సనాతన ధర్మ సంసద్ నిర్వహిస్తామని అయోధ్యలోని సాధువు సంఘం తెలిపింది. 2022 లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జగద్దురు పరమహంస తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.