చప్పట్లు కొట్టించడం, దీపాలు పెట్టించడం సరిపోదు : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2020-04-05T00:42:48+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారితో పోరాటానికి జనం చేత చప్పట్లు కొట్టించడం, దీపాలు పెట్టించడం

చప్పట్లు కొట్టించడం, దీపాలు పెట్టించడం సరిపోదు : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారితో పోరాటానికి జనం చేత చప్పట్లు కొట్టించడం, దీపాలు పెట్టించడం సరిపోదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం అన్నారు. ఈ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వీలుగా తగిన స్థాయిలో పరీక్షలు నిర్వహించడం లేదన్నారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 9 నిమిషాల వరకు ప్రజలు తమ ఇళ్ళలోని విద్యుత్తు దీపాలు ఆర్పేసి, నూనె దీపాలు, టార్చిలైట్లు, కొవ్వొత్తులు వంటివాటిని వెలిగించాలని పిలుపునిచ్చారు. మహమ్మారిపై పోరాటంలో సమైక్యతను, ఉమ్మడి దృఢ సంకల్పాన్ని చాటడం కోసం ఈ విధంగా చేయాలని కోరారు. 


అయితే ఈ కార్యక్రమం కేవలం ఇళ్ళకు మాత్రమే పరిమితమని కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. ఆసుపత్రులు, వీథి లైట్లు, ఇళ్లలో ఉండే కంప్యూటర్లు, ఫ్యాన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వివిధ శాఖల కార్యాలయాలు వంటివాటికి ఈ పిలుపు వర్తించదని వివరించింది. ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు, మునిసిపల్ సర్వీసెస్, కార్యాలయాలు, మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాలు, పబ్లిక్ యుటిలిటీస్ వంటివాటిలో విద్యుత్తు దీపాలు ఆర్పేయవలసిన అవసరం లేదని తెలిపింది. 


ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా మోదీ పిలుపుపై ఘాటుగా స్పందించారు. కోవిడ్-19 వైరస్‌తో పోరాడేందుకు భారత దేశం తగినన్ని పరీక్షలు నిర్వహించడం లేదన్నారు. జనం చేత చప్పట్లు కొట్టించడం, ఆకాశం వైపు టార్చిలైట్లు వెలిగించడం సమస్యను పరిష్కరించబోవన్నారు. 


10 లక్షల జనాభాకు కేవలం 29 మందికి మాత్రమే కోవిడ్-19 పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. అదే పాకిస్థాన్‌లో 67, శ్రీలంకలో 97, బ్రిటన్‌లో 1,891, అమెరికాలో 2,732, జర్మనీలో 5,812, ఇటలీలో 7,122, దక్షిణ కొరియాలో 7,622 మందికి పరీక్షలు జరుగుతున్నట్లు తెలిపారు.


భారత దేశంలో ఇంత తక్కువగా పరీక్షలు జరగడానికి కారణం ప్రధాన మంత్రి పట్టించుకోకపోవడమేనని ఆరోపించారు.


Updated Date - 2020-04-05T00:42:48+05:30 IST