ఐఏఎంసీ ప్రారంభించడం సంతోషంగా ఉంది: సీజేఐ ఎన్వీ Ramana
ABN , First Publish Date - 2021-12-18T17:34:15+05:30 IST
ఐఏఎంసీని ప్రారంభించడం సంతోషంగా ఉందని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు.
హైదరాబాద్: ఐఏఎంసీని ప్రారంభించడం సంతోషంగా ఉందని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. శనివారం ఉదయం నగరంలోని నానక్రాంగూడలో ఐఏఎంసీ కేంద్రాన్ని సీజేఐ ఎన్వీరమణ, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం సీజేఐ మాట్లాడుతూ తాను సీజేఐ కాగానే ఐఏఎంసీ ఏర్పాటును ప్రతిపాదించానని... దీనికి ఆగస్టు 20న సీఎం కేసీఆర్ అంగీకరించారని అన్నారు. కేవలం నాలుగు నెలల్లోనే కార్యరూపం దాల్చిందని తెలిపారు. ఐఏఎంసీ ఏర్పాటుకు హైదరాబాద్ అన్నివిధాలా అర్హమైనదని చెప్పుకొచ్చారు. మౌలిక వసతులు కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి సీజేఐ ధన్యవాదాలు తెలియజేశారు. వివాదాల పరిష్కారంలో జాప్యం జరిగితే నష్టం ఏర్పడుతుందన్నారు. ఇరుపక్షాల అంగీకారంతో త్వరితగతిన కేసుల పరిష్కారం అవుతుందని అభిప్రాయపడ్డారు. తక్కువ వ్యయంతో స్వల్ప సమయంలో పరిష్కారమే లక్ష్యమన్నారు. అన్ని రకాల కేసుల్లో మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. సాంకేతిక నైపుణ్యం, నిపుణుల సలహాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాజీ, మధ్యవర్తిత్వంలో ఐఏఎంసీ పాత్ర కీలకమని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు.