బదిలీలకు బ్రేక్
ABN , First Publish Date - 2022-07-14T04:54:01+05:30 IST
వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల బదిలీలకు బ్రేక్ పడింది. సర్కిల్స్ పునర్వ్యవస్థీకరణ, పారదర్శకత లేని బదిలీలను బహిష్కరిస్తూ ఏపీసీటీ సర్వీసెస్ అసోసియేషన్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది.
సీటీ శాఖ ఉద్యోగుల అభ్యంతరాలతో ప్రభుత్వం వెనక్కి..
గుంటూరు, జూలై 13: వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల బదిలీలకు బ్రేక్ పడింది. సర్కిల్స్ పునర్వ్యవస్థీకరణ, పారదర్శకత లేని బదిలీలను బహిష్కరిస్తూ ఏపీసీటీ సర్వీసెస్ అసోసియేషన్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ఉద్యోగుల బదిలీల ప్రక్రియకు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అస్తవ్యస్తంగా రూపొందించిన బదిలీలను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నులశాఖ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా బుధవారం నుంచి ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. రాష్ట్రంలో నాలుగు జోన్లు ఉండగా, మూడు జోన్లలో మాత్రమే రీజనల్ కార్యాలయాలను ఏర్పాటు చేయటంతోనే సమస్య వస్తోందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి బదిలీల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయటంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.
చిలకలూరిపేట సర్కిల్ కోసం మంత్రి రజని పట్టు...
సీటీశాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా చిలకలూరిపేట సర్కిల్ కార్యాలయాన్ని రద్దు చేయటంపై స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విడదల రజిని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దశాబ్ధాలుగా కొనసాగుతున్న సర్కిల్ కార్యాలయం రద్దు చేయటంతో పట్టణంతో పాటు చుట్టుపక్కల వ్యాపారులు అనేక వ్యయప్రయాసలు పడాల్సి వస్తుందని ఆమె అభ్యంతరం తెలియజేసినట్లు సమాచారం. ఇటీవలనే మంత్రి అంబటి రాంబాబు కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సీటీ శాఖ సత్తెనపల్లి సర్కిల్ను రద్దు చేయకుండా మంత్రి బుగ్గనతో పాటు అధిష్టానంతో చర్చించి ఒప్పించుకున్నారు. అలానే చిలకలూరిపేట సర్కిల్ కూడా తిరిగి ఏర్పాటయ్యే ఛాన్స్ ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.