భారత్‌కు ‘సిటీ’ గుడ్‌బై!

ABN , First Publish Date - 2021-04-16T05:57:50+05:30 IST

భారత్‌లో కన్స్యూమర్‌ బ్యాంకింగ్‌ వ్యాపారం నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికన్‌ బ్యాంకింగ్‌ సేవల దిగ్గజం

భారత్‌కు ‘సిటీ’ గుడ్‌బై!

కన్స్యూమర్‌ బ్యాంకింగ్‌ సేవల నుంచి ఎగ్జిట్‌


ముంబై: భారత్‌లో కన్స్యూమర్‌ బ్యాంకింగ్‌ వ్యాపారం నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికన్‌ బ్యాంకింగ్‌ సేవల దిగ్గజం సిటీ బ్యాంక్‌ ప్రకటించింది. క్రెడిట్‌ కార్డులు, రిటైల్‌ బ్యాంకింగ్‌, హోమ్‌ లోన్స్‌, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఈ వ్యాపార విభాగ పరిధిలోకి వస్తాయని బ్యాంక్‌ స్పష్టం చేసింది. ఈ బ్యాంక్‌కు దేశంలో 35  శాఖలు ఉన్నాయి.  సిటీ కన్స్యూమర్‌ బ్యాంకింగ్‌ విభాగంలో దాదాపు 4,000 మంది పనిచేస్తున్నారు. భారత్‌ సహా 13 దేశాల్లో కన్స్యూమర్‌ బ్యాంకింగ్‌ నుంచి వైదొలుగుతున్నట్లు సిటీ బ్యాంక్‌ గ్లోబల్‌ సీఈఓ జేన్‌ ఫ్రేజర్‌ గురువారం వెల్లడించారు.


ఈ మార్కెట్లలో తమ బ్యాంక్‌ ఇతర సంస్థలతో పోటీపడలేకపోతుండటమే ఇందుకు కారణమని ఆయన స్పష్టం చేశారు. సిటీ బ్యాంక్‌ ఈ వ్యాపారం నుంచి ఎలా వైదొలగనుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. అంతేకాదు, భారత్‌లో ఈ వ్యాపారం నుంచి వైదొలిగేందుకు ఆర్‌బీఐ ఆమోదమూ అవసరం. అప్పటివరకు తమ కస్టమర్లకు యధావిధిగా సేవలందించనున్నట్లు సిటీ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అశు ఖుల్లార్‌ తెలిపారు. 1902లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన సిటీ.. 1985లో కన్స్యూమర్‌ బ్యాంకింగ్‌ సేవలను ప్రారంభించింది. 



ఇనిస్టిట్యూషనల్‌ బ్యాంకింగ్‌పై ఫోకస్‌: భారత్‌లో కన్స్యూమర్‌ బ్యాంకింగ్‌ నుంచి వైదొలిగిన తర్వాత ఇనిస్టిట్యూషనల్‌ బ్యాంకింగ్‌తో పాటు ఆఫ్‌షోర్‌, గ్లోబల్‌ బిజినెస్‌ సపోర్ట్‌పై దృష్టి సారించనున్నట్లు సిటీ బ్యాంక్‌ తెలిపింది. ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్‌లోని కేంద్రాల ద్వారా  సిటీ బ్యాంక్‌ ఈ సేవలను అందించనుంది.  


Updated Date - 2021-04-16T05:57:50+05:30 IST