విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవే టీకరణ నిలిపివేయాలి
ABN , First Publish Date - 2021-08-04T05:25:07+05:30 IST
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.
ఏలూరు కలెక్టరేట్/పెదవేగి, ఆగస్టు 3 : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీ పార్లమెంటు వద్ద ఆందోళన చేస్తున్న విశాఖ స్టీలు ప్లాంటు ఉద్యోగులు, కార్మికులకు మద్దతు గా సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద, పెదవేగి మండలంలో పెదవేగి పీహెచ్సీ వద్ద ఆశా కార్యకర్తలు మంగళవారం ధర్నా నిర్వహించారు. అధ్యక్ష, కార్యదర్శులు బి.సోమయ్య, డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ మూడు లక్షల కోట్ల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆస్తిని రూ. 30 వేల కోట్లకు ప్రధాని మోదీ తన అనుయాయులకు కట్టబెట్టడం కోసం ప్రైవేటీకరణ పాటపాడుతున్నారని విమర్శించారు. అమరుల త్యాగాలతో ప్లాంటు సాధించు కుందని ఎట్టి పరిస్థితు ల్లో ప్లాంటును కాపాడుకుంటామని తెలిపారు. ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోకపోతే ఆంధ్రా ప్రజలు కేంద్రప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. నాయకులు పి.కిషోర్, డి.జగన్నాథరావు, వీరంకి సాయి బాబా, కె.విజయలక్ష్మి, అప్పన్న, వరదా వెంకట్రావు, బి.జనార్ధన తదితరులు నాయకత్వం వహించారు. పెదవేగి మండలంలో సీఐటీయూ నాయకులు పి.ప్రసాద్, సచివాలయ హెల్త్ అసోసియేషన్ నాయకులు జ్యోతి, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు రోజా, మౌనిక, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.