ప్రైవేటు విద్యాసంస్థలలో పని చేస్తున్న సిబ్బందిని ఆదుకోవాలి
ABN , First Publish Date - 2021-05-16T06:07:06+05:30 IST
ప్రైవేటు విద్యాసంస్థలలో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని కరోనా కష్టకాలంలో ఆదుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది.
నరసరావుపేట టౌన్, మే 15 : ప్రైవేటు విద్యాసంస్థలలో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని కరోనా కష్టకాలంలో ఆదుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఆర్డీవో కార్యాలయంలో శనివారం శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ డీ.శివ కుమారి, సీఐటీయూ మండల కార్యదర్శి శిలార్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన ఏడాది కాలంగా ప్రైవేటు విద్యా సంస్థలలో సిబ్బందికి కరోనా నేపధ్యంలో వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో ప్రైవేటు ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. కరోనా ప్రభావంతో తలక్రిందులైన ప్రైవేటు ఉపాధ్యాయుల జీవితాలను ఆదుకోనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రైవేటు ఉపాధ్యాయుల కోసం ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేసి ఆదుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రైవేటు సంస్థలలో పనిచేసే సిబ్బందికి ఆర్థిక సహాయం అందించిందన్నారు. బోధన, బోధనేతన సిబ్బందికి రూ.పది వేలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు.