బొమ్మ పడిందిగానీ..
ABN , First Publish Date - 2021-07-31T08:49:40+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. ‘ఇష్క్’, ‘తిమ్మరుసు’ చిత్రాలు విడుదలయ్యాయి. అయితే.. తెలంగాణలో మేజర్ థియేటర్లన్నీ తెరుచుకున్నా ఆక్యుపెన్సీ 30
ఆంధ్రాలో తెరుచుకుంది10% థియేటర్లే
తెలంగాణలో కేవలం 30 శాతం ఆక్యుపెన్సీ
సినిమా డెస్క్-ఆంధ్రజ్యోతి: తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. ‘ఇష్క్’, ‘తిమ్మరుసు’ చిత్రాలు విడుదలయ్యాయి. అయితే.. తెలంగాణలో మేజర్ థియేటర్లన్నీ తెరుచుకున్నా ఆక్యుపెన్సీ 30 శాతమే ఉంది. సినీ సందడికి అడ్డా అయిన ఆర్టీసీ క్రాస్రోడ్స్లో కొంత హడావుడి కనిపించింది. అయితే.. చాలా థియేటర్లలో ప్రేక్షకులు అంతంతమాత్రంగానే కనిపించారు. కొన్ని థియేటర్లలో 50 మంది ప్రేక్షకులు కూడా కనిపించలేదు. ఇక, ఏపీలో అయితే కేవలం 10 శాతం థియేటర్లలోనే బొమ్మ పడింది. ముఖ్యంగా.. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క థియేటర్ కూడా తెరుచుకోలేదు. బీసీ సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. దీనిపై ఏపీ చాంబర్ జాయింట్ సెక్రటరీ వీరనారాయణ బాబు మాట్లాడారు.
‘‘శుక్రవారం రెండు సినిమాలే విడుదల కావడం వల్ల 10 శాతం థియేటర్లే తెరుచుకున్నాయి. జనాల్లో కరోనా భయం ఇంకా ఉంది. అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి ఆదరణ బావుంది. రానున్న రెండు వారాల్లో 80 శాతం థియేటర్లు అందుబాటులోకి వస్తాయి’’ అని తెలిపారు. ఇక తెలంగాణాలో మేజర్ థియేటర్లు తెరుచుకున్నాయని.. ఆక్యుపెన్సీ 30 శాతం ఉందని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ తెలిపారు.