ప్రొడక్షన్ మేనేజర్ కిడ్నాప్ వ్యవహారం..
ABN , First Publish Date - 2020-08-15T10:07:10+05:30 IST
సినీ ప్రొడక్షన్ మేనేజరు తిమ్మారెడ్డి కిడ్నాప్, దాడి కేసులో వైసీపీ నేత పీవీపీ కుటుంబ సభ్యులు ..
విచారణకు హాజరైన పీవీపీ కుటుంబీకులు
బంజారాహిల్స్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): సినీ ప్రొడక్షన్ మేనేజరు తిమ్మారెడ్డి కిడ్నాప్, దాడి కేసులో వైసీపీ నేత పీవీపీ కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. శుక్రవారం పీవీపీ సతీమణి ఝాన్సీ, సోదరి పద్మ, మేనేజర్ అంబికలను జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ విచారించారు. పీవీపీ చిత్రాల్లో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసే తిమ్మారెడ్డి.. ఆర్థిక లావాదేవీల్లో మోసాలకు పాల్పడ్డారంటూ ఆయనను 2019 సెప్టెంబరులో పీవీపీ కార్యాలయంలో నిర్బంధించారు. ఆ తర్వాత విజయవాడలో చికిత్స చేయించినట్లు ఆరోపణలున్నాయి.
కోలుకున్న తర్వాత ఆయనను నల్లగొండ వద్ద వదిలిపెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై 3 వారాల క్రితం పీవీపీ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ ఎస్హెచ్వో ముందు విచారణకు హాజరై, బెయిలు పొందాలని కోర్టు సూచించింది. దీంతో శుక్రవారం పీవీపీ సతీమణి, సోదరి, మేనేజర్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.