దైవదర్శనానికి వెళుతూ ఐదుగురు మృతి

ABN , First Publish Date - 2022-08-09T06:26:15+05:30 IST

దైవ దర్శనానికి వెళుతూ రోడ్డుప్రమాదంలో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకుచెందిన ఐదుగురు మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగింది

దైవదర్శనానికి వెళుతూ ఐదుగురు మృతి

ప్రకాశం జిల్లా దర్శి వద్ద ఘటన

మృతులు పల్నాడు జిల్లావాసులు

అందరిదీ ఒకే కుటుంబం

   

వెల్దుర్తి, బేస్తవారిపేట, ఆగస్టు8: దైవ దర్శనానికి వెళుతూ రోడ్డుప్రమాదంలో పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకుచెందిన ఐదుగురు మృతిచెందిన ఘటన ప్రకాశం జిల్లా దర్శి వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన జూలకంటి నాగిరెడ్డి లండన్‌లో ఎంఎస్‌ చదువుతూ మంచి ఉద్యోగం సాధించాడు. కొన్నిరోజులు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన నాగిరెడ్డి స్వగ్రామానికి వచ్చి తమ మొక్కులు తీర్చుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం రెండు కార్లలో కుటుంబసభ్యులతో కలసి తిరుపతి ప్రయాణమయ్యాడు. ఒక కారులో తాతయ్య చిలకల హనిమిరెడ్డి, అమ్మమ్మలు ఆదిలక్ష్మి, గురవమ్మ, అనంతరావమ్మ కలసితానే కారు నడుపుతూ బయలుదేరాడు. మార్గమధ్యలో ప్రకాశం జిల్లా దర్శి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న నాగిరెడ్డి(24)తోపాటు తాతయ్య హనిమిరెడ్డి(60), అమ్మమ్మలు ఆదిలక్ష్మి(58), గురవమ్మ(56), అనంతరావమ్మ(55) అక్కడికక్కడే చనిపోయారు. అక్కడే ఉన్న కొంతమంది కాల్‌డేటా ఆధారంగా మరో కారులో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా ప్రాంతానికి చేరుకొని సిరిగిరిపాడులో ఉన్న తమ బంధువులకు సమాచారమిచ్చారు.  

తల్లిదండ్రులు ఆశలు అడియాశలు.. 

కూలినాలి చేసుకొని కొడుకును ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగం రావటంతో తమ కష్టాలు తీరుతాయనుకున్న తల్లిదండ్రులు ఆశలు అడియాశలయ్యాయి. నాగిరెడ్డి తండ్రి జూలకంటి హనిమిరెడ్డి, తల్లి గురవమ్మలు వ్యవసాయ కూలిపనులు చేసుకుంటూ నాగిరెడ్డితోపాటు మరో కొడుకు శ్రీనివాసరెడ్డిని మంచి చదువులు చదివించారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి ఉద్యోగవేటలో ఉండగా నాగిరెడ్డి మంచి ప్యాకేజీతో లండన్‌లో ఉద్యోగం సాధించాడు. ఈలోగా ఈ దుర్ఘటన వారి కుటుంబాన్ని తీవ్ర దుఃఖానికి గురిచేసింది. 

గ్రామంలో విషాదచాయలు 

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందటంతో వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. ఒకే ఇంట్లో పుట్టిపెరిగిన అక్కాచెల్లెళ్లు ఆదిలక్ష్మి, గురవమ్మ, అనంతరావమ్మలు ఒకేసారి తనువు చాలించటంతో బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆదిలక్ష్మి, గురవమ్మలు సిరిగిరిపాడులో ఉంటుండగా అనంతరావమ్మ బొల్లాపల్లి మండలం రేవిడిచర్లలో ఉంటోంది. ఆదివారం తిరుపతికి వెళ్లేందుకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు కలుసుకొని ఒకే కారులో పయనమయ్యారు.  

ఎమ్మెల్యే పీఆర్కే, బ్రహ్మారెడ్డి, శివారెడ్డి పరామర్శ 

గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలను సోమవారం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తెలుగుదేశంపార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జూలకంటి బ్రాహ్మారెడ్డి, టీడీపీ తెలుగయువత రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ  కుర్రి శివారెడ్డిలు పరామర్శించారు.  కుటుంబసభ్యులను ఓదార్చారు. 

Updated Date - 2022-08-09T06:26:15+05:30 IST