రాజధానిలో భూములు కొనడమే తప్పా?

ABN , First Publish Date - 2020-12-03T09:28:19+05:30 IST

అమరావతి భూముల కొనుగోళ్ల వ్యవహారంపై సీఐడీ కేసులు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.

రాజధానిలో భూములు కొనడమే తప్పా?

హైకోర్టులో న్యాయవాది లూథ్రా

రాజధాని భూములపై తీర్పు రిజర్వ్‌ 


అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): అమరావతి భూముల కొనుగోళ్ల వ్యవహారంపై సీఐడీ కేసులు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఆయా భూముల కొనుగోళ్ల పత్రాలను తమ ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించారు. భూముల కొనుగోళ్లకు సంబంధించి తమపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని అభ్యర్ధిస్తూ కిలారు రాజేశ్‌, నార్త్‌ ఫేస్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, చేకూరి తేజస్వి, గుంటూరులోని లలిత సూపర్‌ స్పెషాలిటీస్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ పీవీ రాఘవ తదితరులు వేర్వేరుగా వేసిన పిటిషన్లపై బుధవారం మరోసారి విచారణ జరిగింది. 


కిలారు రాజేష్‌ తదితరుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్‌ ్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ... ‘‘రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేయడమే తప్పంటే ఎలా? అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందని 2014 నుంచే ప్రసార మాధ్యమాల్లో, పత్రికల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. భూయజమానులు స్వచ్ఛందంగా అమ్మకానికి పెడితేనే భూముల కొనుగోళ్లు జరిగాయి. అందువల్ల పిటిషనర్‌పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయండి’’ అని అభ్యర్థించారు. నార్త్‌ ఫేస్‌ హోల్డింగ్స్‌ డైరెక్టర్లు తొట్టెంపూడి వెంకటేశ్వరరావు, చేకూరి తేజస్వి తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. తాము భూములు కొనుగోలు చేయడం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు.  కాగా,  సీఐడీ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌. శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. ‘‘అమరావతి భూముల కొనుగోళ్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది. కుట్రకోణం దాగి ఉంది. సీఐడీ ప్రాథమిక విచారణలో చాలా విషయాలు బయటపడుతున్నాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది. దర్యాప్తును కొనసాగించేలా ఆదేశించండి’’ అని అభ్యర్థించారు. 

Updated Date - 2020-12-03T09:28:19+05:30 IST